Suryakumar Yadav : దక్షిణాఫ్రికాపై విజయం వెనుక రహస్యం ఇదే.. సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను పరుగులు చేయడంలో కొంత ఇబ్బంది పడుతున్నది వాస్తవమేనని అంగీకరించినప్పటికీ, ఫామ్ కోల్పోలేదని స్పష్టం చేశాడు. త్వరలోనే మళ్లీ భారీ స్కోర్లు చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, "నిజం చెప్పాలంటే నేను నెట్స్లో చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను. నా నియంత్రణలో ఉన్న ప్రతిదాన్నీ ప్రయత్నిస్తున్నాను. పరుగులు రావాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తాయి.
Details
ఫామ్ కోల్పోలేదు
నేను పరుగుల కోసం చూస్తున్నాను కానీ ఫామ్లో లేనని మాత్రం చెప్పను" అని వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ 12 పరుగులకే ఔటయ్యాడు. గత మ్యాచ్లో ఎదురైన ఓటమి నుంచి జట్టు ఎలా తిరిగి పుంజుకుందనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ప్రాథమిక అంశాలపై దృష్టి సారించడమే కీలకమని పేర్కొన్నాడు. క్రికెట్ ఎన్నో పాఠాలు నేర్పుతుందని, సిరీస్లోకి ఎలా పునరాగమనం చేస్తామన్నదే ముఖ్యమని చెప్పాడు. కటక్లో ఆడిన మ్యాచ్లో చేసినట్లే మళ్లీ బేసిక్స్పై ఫోకస్ పెట్టామని, దాని ఫలితంగానే ఈ విజయం వచ్చిందని వివరించాడు.
Details
బౌలర్లు అద్భుతంగా రాణించారు
చండీగఢ్లో జరిగిన మ్యాచ్ నుంచి కూడా చాలా నేర్చుకున్నామని వెల్లడించాడు. ధర్మశాలలో బౌలర్ల ప్రణాళికాబద్ధమైన ప్రదర్శన, క్రమశిక్షణే విజయం సులభంగా అందేలా చేశాయని సూర్యకుమార్ ప్రశంసించాడు. "బౌలర్లందరం కలిసి కూర్చుని చర్చించాం. మంచి టీమ్ మీటింగ్ జరిగింది. ప్రాక్టీస్లో కూడా అదే అంశాలపై దృష్టి పెట్టాం. కొత్తగా ఏమీ ప్రయత్నించకుండా బేసిక్స్కే కట్టుబడి ఉన్నాం" అని తెలిపాడు. సిరీస్ను గెలవాలంటే బుధవారం లక్నోలో జరగనున్న మ్యాచ్లో భారత్ తప్పకుండా విజయం సాధించాల్సి ఉందని పేర్కొన్నాడు.