Rajiv Gandhi International Stadium: ఐపీఎల్ 2025కు పటిష్ట బందోబస్తు.. 450 సీసీ కెమెరాలతో నిఘా
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో మార్చి 23 నుంచి మే 21 వరకు జరిగే 18వ ఎడిషన్ టాటా ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సోమవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, ఉప్పల్ స్టేడియం అధికారులు, సన్రైజర్స్ టీమ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ సుధీర్బాబు మాట్లాడుతూ, క్రికెట్ మ్యాచ్ల సందర్భంగా sభద్రతా పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అవాంఛనీయ ఘటనలకు దారితీసే ఎలక్ట్రానిక్ పరికరాలు, అగ్గిపెట్టెలు, ల్యాప్టాప్లు, పదునైన వస్తువులు, తినుబండరాలు, వాటర్ బాటిల్స్ వంటి వాటిని స్టేడియంలోకి అనుమతించకూడదని స్పష్టంగా ఆదేశించారు.
Details
టికెట్ల పంపిణీ విషయంలో జాగ్రత్తలు పాటించాలి
భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు.
కార్లు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, సాధారణ వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఉప్పల్ రహదారిపై ట్రాఫిక్ రద్దీ నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
భద్రత పెంచడంలో భాగంగా స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. క్రికెట్ మ్యాచ్ల సమయంలో సివిల్, ట్రాఫిక్, రిజర్వు పోలీస్, ఎస్ఓటీ విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని సీపీ తెలిపారు.
టికెట్ల పంపిణీ సమయంలో గందరగోళం ఏర్పడకుండా ఐపీఎల్ బృందం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో మల్కాజిగిరి డీసీపీలు పద్మజ, అరవింద్బాబు, ఇందిర, నర్సింహారెడ్డి, మల్లారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.