
Under-19: అండర్-19 ప్రపంచకప్ విజేతలు తన్మయ్, అజితేశ్.. ఇప్పుడు అంపైర్లుగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు 17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టులో కీలక పాత్ర పోషించిన తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్ అర్గల్ ఇప్పుడు క్రికెట్ మైదానంలోకి మళ్లీ అడుగుపెట్టారు, కానీ ఈసారి ఆటగాళ్లుగా కాకుండా అంపైర్లుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. విరాట్ కోహ్లీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ స్టార్గా వెలుగొందుతున్న సమయంలో, అతని సహచరులు అంపైర్లుగా తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది. 2008లో జరిగిన ఆ ప్రపంచకప్లో ఎడమచేతి వాటం ఓపెనర్ తన్మయ్ శ్రీవాస్తవ 262 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా నిలిచాడు.
Details
అంతర్జాతీయ స్థాయిలో అంపైరింగ్ ప్రయాణం
మీడియం పేసర్ అజితేశ్ అర్గల్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్' అవ్వడం గమనార్హం. ఇన్నాళ్ల తర్వాత, వీరిద్దరూ కాన్పూర్లో జరిగిన భారత్ 'ఏ' vs ఆస్ట్రేలియా 'ఏ' మూడు మ్యాచ్ల సిరీస్లో అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో బీసీసీఐ అంపైరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తమ్మయ్, అజితేశ్.. ఇప్పటికే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టోర్నీలలో అంపైరింగ్ చేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఇప్పుడు, భారత్ 'ఏ' సిరీస్ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తమ అంపైరింగ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. గతంలో, తన్మయ్ ఐపీఎల్లో అంపైర్గా పని చేసినందుకు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టాలెంట్ స్కౌట్గా కూడా సేవలు అందించారు.
Details
90 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులాడిన శ్రీవాస్తవ
క్రికెటర్లుగా వారి కెరీర్లను పరిశీలిస్తే, అజితేశ్ అర్గల్ కేవలం 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడాడు, కానీ తన్మయ్ శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున దాదాపు 10 ఏళ్లపాటు 90 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలో సత్తా చాటాడు. ప్రస్తుతం భారత అంపైర్లలో నితిన్ మీనన్ మాత్రమే ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ స్థిరమైన ప్రదర్శన ద్వారా ముందుగా ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్, ఆ తర్వాత ఎలైట్ ప్యానెల్లో చోటు పొందాలని ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.