Mohammad Kaif: విరాట్ కోహ్లీకి దేశవాళీ అవసరం లేదు,వన్డేలోనే అద్భుత ఫామ్: మహ్మద్ కైఫ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన మూడు వన్డే సిరీస్లో అతను మొత్తం 240 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఇందౌర్ వన్డేలో కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులు చేసి అభిమానులను మంత్రముగ్దులను చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 10 ఫోర్లు,3 సిక్స్లు కొట్టాడు. ఈ సందర్భంలో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ భారత్ తరపున వన్డేలు ఆడితే చాలు, దేశవాళీ మ్యాచ్లలో పాల్గొనాల్సిన అవసరం లేదని కైఫ్ తెలిపారు.
వివరాలు
కోహ్లీ ఫిట్నెస్, క్రికెట్ పట్ల అంకితభావం, స్వీయ సన్నద్ధత అద్భుతం
కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ: "విరాట్ కోహ్లీ లండన్ నుంచి వచ్చి, పరుగులు సాధిస్తున్నాడు, తిరిగి వెళ్తున్నాడు. రెగ్యులర్గా ఆడకపోయినా ఇలా స్థిరంగా పరుగులు రాబట్టడం చాలా సులభం కాదు. అతడి ఫిట్నెస్, క్రికెట్ పట్ల అంకితభావం, స్వీయ సన్నద్ధత అద్భుతం" అని పేర్కొన్నారు. అతను దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని కూడా కైఫ్ చెప్పారు. "మ్యాచ్ ప్రాక్టీస్ ఎవరైనా పొందుతారు. కానీ ఆట పట్ల కోహ్లీకి ఉన్న ఆ ఆసక్తి, అంకితభావం ఇతరులు పొందడం సాధ్యం కాదు. అది మార్కెట్లో దొరకదు. చివరి వన్డేలలోనూ అతను బ్యాటింగ్లో అద్భుతంగా రాణించాడు" అని కైఫ్ విశ్లేషించారు.
వివరాలు
వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్లో కోహ్లీ నం.1
ప్రస్తుతం కోహ్లీ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే నుంచి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. తన చివరి ఏడు ఇన్నింగ్స్లో 123.2 రన్ల యావరేజ్తో 616 పరుగులు కొట్టాడు. ఇందులో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే, ఐసీసీ (ICC) వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్లో కోహ్లీ నం.1 స్థానాన్ని కొనసాగిస్తున్నాడు.