Womens Asia Cup: నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ వద్దని ముందే చెప్పాం: బీసీసీఐ ఉపాధ్యక్షుడు
ఈ వార్తాకథనం ఏంటి
గతేడాది పురుషుల ఆసియా కప్లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్, పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అయిన మోసిన్ నఖ్వీ (Mohsin Naqvi) చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం జరిగిన ఆసియా కప్ మహిళల క్రికెట్ టోర్నీలోనూ ఇదే పరిణామం పునరావృతమైంది. ఆసియా కప్ మహిళల టోర్నీలో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. అయితే ట్రోఫీ ప్రదానోత్సవానికి మోసిన్ నఖ్వీ హాజరయ్యారు. దీంతో గత ఏడాది మాదిరిగానే ఆయన చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత మహిళల జట్టు నిరాకరించింది.
వివరాలు
'మా ఉమ్మడి నిర్ణయం'
మోసిన్ నఖ్వీ ట్రోఫీని అందజేసే పక్షంలో ప్రదానోత్సవ కార్యక్రమానికి భారత మహిళల జట్టు హాజరుకాదని బీసీసీఐ (BCCI) ముందుగానే ఆసియా క్రికెట్ కౌన్సిల్కు (ACC) స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) తెలిపారు.
ఈ పరిణామంపై రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ''మేము ఈ విషయంపై చర్చించుకుని మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నాం. అది మా ఉమ్మడి నిర్ణయం. దీనికి నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఈ పరిణామాల గురించి మా జట్టుకు తెలియజేశాం. ఏసీసీ ఛైర్మన్ ట్రోఫీని ఎవరికి అప్పగించాలో.. వారికి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు'' అని తెలిపారు.
వివరాలు
గత సంప్రదాయాన్ని గుర్తుచేసిన సైకియా
ప్రస్తుత ఐసీసీ (ICC) చైర్మన్ జైషా.. ఏసీసీలో ఉన్న సమయంలో ఆసియా కప్లో విజేతగా నిలిచిన జట్టుకు చెందిన ఆఫీస్ బేరర్ ట్రోఫీని అందజేయడం సంప్రదాయంగా ఉండేదని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా గుర్తుచేశారు.
అయితే గతేడాది నుంచి ఏసీసీ ఈ సంప్రదాయాన్ని పాటించడం లేదని ఆయన తెలిపారు. పురుషుల, మహిళల ఆసియా కప్ ట్రోఫీలను త్వరలోనే భారత్కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని దేవ్జిత్ సైకియా వెల్లడించారు.