Gautam Gambhir: టీమిండియా భవిష్యత్తుపై ప్రభావమా?.. గంభీర్ కోచింగ్పై ప్రశ్నలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ ఓటమితో మూడు వన్డేల సిరీస్ను భారత్ 1-2తో కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లీ శతకం బాదినా, నితీశ్కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అర్ధశతకాలతో రాణించినా.. టీమ్ఇండియాకు విజయాన్ని అందించలేకపోయారు. ఈ పరాజయంతో కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, నిర్ణయాలు, జట్టు ఎంపికలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Details
సోషల్ మీడియాలో విమర్శలు
సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు గంభీర్ను ట్రోల్ చేస్తున్నారు. ఆటగాడిగా గంభీర్ గొప్పవాడే కానీ, కోచ్గా మాత్రం విఫలమవుతున్నాడని విమర్శిస్తున్నారు. బీ, సీ స్థాయి జట్లపై కూడా విజయాలు సాధించలేకపోతున్నామని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు చేసినది చాలు, వెంటనే కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక టీమ్ఇండియా మరో అయిదు నెలల తర్వాతే వన్డే మ్యాచ్ ఆడనుంది. జులై 14న ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
Details
ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్
ప్రస్తుతం భారత జట్టు దృష్టంతా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్పైనే ఉంది. అంతకుముందు జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో అయిదు టీ20ల సిరీస్ మొదలుకానుంది. ఈ పొట్టి ఫార్మాట్లోనూ భారత్కు ప్రతికూల ఫలితాలు ఎదురైతే, కోచ్గా గౌతమ్ గంభీర్ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఫలితం, అలాగే టీ20 వరల్డ్ కప్లో భారత జట్టు ప్రదర్శనే గంభీర్ భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.