Ranji Trophy final: జమ్ముకశ్మీర్ చరిత్ర సృష్టిస్తుందా? రంజీ ఫైనల్లో కర్ణాటకతో మహాసమరం!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్కు సమయం ఆసన్నమైంది. మంగళవారం ప్రారంభమయ్యే తుది సమరంలో ఎనిమిదిసార్లు ఛాంపియన్గా నిలిచిన కర్ణాటక, తొలిసారి టైటిల్ పోరుకు చేరిన జమ్ముకశ్మీర్తో తలపడనుంది. అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లతో నిండిన కర్ణాటకను జమ్ము కశ్మీర్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. జమ్ము కశ్మీర్ బౌలింగ్ దళానికి ఈ సీజన్లో 55 వికెట్లు పడగొట్టిన పేసర్ అకిబ్ నబి ప్రధాన ఆధారం. బ్యాటింగ్ విభాగంలో అబ్దుల్ సమద్ 655పరుగులతో మెరుగైన ప్రదర్శన చూపగా, కెప్టెన్ పరాస్ డోగ్రా 551 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ శుభమ్ ఖజూరియా, ఆల్రౌండర్ వన్ష్రాజ్ శర్మ ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడటం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
Details
కేఎల్ రాహుల్ పై భారీ ఆశలు
ఇక కర్ణాటక జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్యంగా బలంగా ఉంది. ఈ సీజన్లోనే అత్యధిక పరుగులు సాధించిన రవిచంద్రన్ స్మరణ్ 950 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. అతనికి తోడుగా కరుణ్ నాయర్ 699, కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ 532, మయాంక్ అగర్వాల్ 518 పరుగులతో జోరు మీద ఉన్నారు. మూడు మ్యాచ్ల్లోనే 457 పరుగులు చేసిన సీనియర్ బ్యాటర్ 'కేఎల్ రాహుల్' ఫైనల్లోనూ కీలక పాత్ర పోషించాలని కర్ణాటక భావిస్తోంది.
Details
ఉత్కంఠ భరితంగా ఫైనల్
అంతేకాదు, బంతితో పాటు బ్యాట్తోనూ ప్రభావం చూపుతున్న శ్రేయస్ గోపాల్ ఈ సీజన్లో 46 వికెట్లు, 442 పరుగులతో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచాడు. ఫైనల్లోనూ అతనిపై కర్ణాటక భారీ ఆశలు పెట్టుకుంది. మొత్తంగా చూస్తే, అనుభవం, సమతుల్య కూర్పు దృష్ట్యా కర్ణాటకనే ఫేవరెట్గా భావిస్తున్నప్పటికీ, చరిత్ర సృష్టించాలనే సంకల్పంతో బరిలోకి దిగుతున్న జమ్ము కశ్మీర్ పోరాటస్ఫూర్తి ఫైనల్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చనుంది.