LOADING...
WT20: మహిళల టీ20 ప్రపంచకప్‌.. నేడు బంగ్లాతో భారత్‌ పోరు..విజయమే లక్ష్యం..
మహిళల టీ20 ప్రపంచకప్‌.. నేడు బంగ్లాతో భారత్‌ పోరు..విజయమే లక్ష్యం..

WT20: మహిళల టీ20 ప్రపంచకప్‌.. నేడు బంగ్లాతో భారత్‌ పోరు..విజయమే లక్ష్యం..

వ్రాసిన వారు Moogati Shabari
Jun 25, 2026
09:50 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో భారత జట్టు సెమీఫైనల్‌ అవకాశాలను కాస్త క్లిష్టం చేసుకుంది. అయితే ఆ నిరాశను పక్కనపెట్టి తదుపరి సవాల్‌కు సిద్ధమవుతోంది. గురువారం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే భారత్‌ మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. చివరి మ్యాచ్‌ బలమైన ఆస్ట్రేలియాతో ఉండటంతో ఆ పోరు అంత సులభం కానే కాదు. అంతేకాదు, ఆ జట్టుపై భారీ తేడాతో గెలవడం మరింత కఠినమైన పని. అందువల్ల బంగ్లాదేశ్‌పై సాధ్యమైనంత పెద్ద విజయాన్ని నమోదు చేసి నెట్‌రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవడం భారత్‌కు అత్యంత కీలకంగా మారింది.

వివరాలు

బంగ్లాదేశ్‌పై ఆధిపత్య విజయమే లక్ష్యంగా బరిలోకి..

సెమీఫైనల్‌ పోటీలో ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికాతో విజయాల సంఖ్య సమానంగా ఉన్నా, నెట్‌రన్‌రేట్‌ తుది నిర్ణయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌పై ఆధిపత్య విజయమే భారత జట్టు ప్రధాన లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అయితే ఈ టోర్నీలో నెదర్లాండ్స్‌పై మినహా భారత బ్యాటింగ్‌ విభాగం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. భారీ స్కోర్లు నమోదు చేయాలంటే బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ మంచి లయలో కనిపిస్తున్నప్పటికీ, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.

వివరాలు

అందరి చూపు శ్రీ చరణి వైపు..

బౌలింగ్‌ విభాగంలో తెలుగు క్రికెటర్‌ శ్రీ చరణి తన అద్భుత స్పిన్‌తో టోర్నీలో అగ్ర బౌలర్‌గా కొనసాగుతోంది. అయితే పేస్‌ బౌలింగ్‌లో భారత్‌ మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాల్సిన అవసరం కనిపిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేయడం భారత్‌కు ప్రమాదకరంగా మారొచ్చు. ఆ జట్టు ఇప్పటికే నెదర్లాండ్స్‌తో పాటు పాకిస్థాన్‌పై కూడా విజయాలు సాధించి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో నిగర్‌ సుల్తానా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్‌లు కీలక పాత్ర పోషిస్తుండగా, మారుఫా, సంజనా, రితు, రబేయా, నహిదా వంటి బౌలర్లు కూడా ప్రత్యర్థులకు సవాల్‌గా నిలుస్తున్నారు. అందుకే బంగ్లాదేశ్‌పై విజయం సాధించాలంటే భారత్‌ పూర్తి ఏకాగ్రతతో, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఆడాల్సి ఉంటుంది.

Advertisement