
Guanajuato: మెక్సికో వేడుకల్లో కాల్పులు.. 12 మంది మృతి.. 20 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మెక్సికో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో నగరంలో ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయాలపాలయ్యారని అధికార వర్గాలు వెల్లడించాయి. స్థానిక వివరాల ప్రకారం,నగరంలో రాత్రివేళ కొంతమంది ఒక వీధి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొన్న వారు డ్రమ్స్ వాయిస్తూ ఆనందంగా నృత్యం చేస్తుండగా,అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తి అక్కడకు వచ్చి గన్తో కాల్పులు ప్రారంభించాడు. దీంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ కాల్పుల వల్ల 12 మంది అక్కడికక్కడే మరణించగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
వివరాలు
బెర్రియోస్ ప్రాంతంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు
ఈ సంఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలు తీవ్రంగా ఖండించదగినవని పేర్కొన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని పేర్కొంటూ, ఈ విషయంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. గమనించదగిన విషయం ఏమిటంటే, గత నెలలో కూడా గ్వానాజువాటో రాష్ట్రంలోని శాన్ బార్టోలో డి బెర్రియోస్ ప్రాంతంలో జరిగిన మరో కార్యక్రమంలో దుండగులు రెచ్చిపోయి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నగరంలో ఇటీవలి కాలంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 2025 ఏడాదిలో ఇప్పటివరకు గ్వానాజువాటో ప్రాంతంలో జరిగిన వివిధ ఘటనల్లో ఇప్పటికే వెయ్యిమందికి పైగా మరణించారని సమాచారం.