LOADING...
Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో విషాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. 23 మంది మృతి.. వీడియో ఇదిగో
23 మంది మృతి.. వీడియో ఇదిగో

Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో విషాదం.. పద్మా నదిలోకి దూసుకువెళ్లిన బస్సు.. 23 మంది మృతి.. వీడియో ఇదిగో

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని విషాదాన్ని మిగిల్చింది. సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. రాజ్‌బరి జిల్లాలోని దౌలత్‌దియా ఫెర్రీ టెర్మినల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

వివరాలు 

ప్రమాదం ఎలా జరిగింది ?

వివరాల ప్రకారం.. ఢాకాకు వెళ్తున్న 'సౌహార్దో పరివాహన్' బస్సు, నదిని దాటేందుకు ఫెర్రీ ఎక్కే క్రమంలో ఘాట్ నెం.3 వద్ద పొంటూన్‌పై నిలిచింది. అదే సమయంలో 'హస్నా హేనా' అనే చిన్న యుటిలిటీ ఫెర్రీ వేగంగా వచ్చి ఆ పొంటూన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఆకస్మిక ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నేరుగా పద్మా నదిలోకి దూసుకెళ్లి మునిగిపోయింది. బస్సు నీటిలో పడిపోతున్న సమయంలో కొందరు ప్రయాణికులు కిటికీల నుంచి బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈద్ పండుగ సెలవుల తర్వాత ప్రజలు తిరిగి రాజధాని ఢాకాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం మరింత విషాదాన్ని కలిగించింది.

వివరాలు 

సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, నౌకాదళం, నదీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు ఆరు గంటల పాటు కష్టపడి 'హంజా' అనే రెస్క్యూ నౌక సహాయంతో పూర్తిగా నీటిలో మునిగిపోయిన బస్సును బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 23 మృతదేహాలను వెలికితీసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రసెల్ మొల్లా మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా గల్లంతైన ప్రయాణికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో.. 

Advertisement