
Iran: ఇరాన్లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఈ వార్తాకథనం ఏంటి
బతుకుదెరువు కోసం ఇరాన్కి వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన పంజాబ్లో కలకలం రేపుతోంది.
వారితో ఎలాంటి సంబంధం లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తమ బిడ్డల గురించి సమాచారం తెలియజేయాలని కోరుతూ వారు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించారు.
అదృశ్యమైన వారు పంజాబ్ రాష్ట్రానికి చెందిన హుషన్ప్రీత్ సింగ్ (సంగ్రూర్),జస్పాల్ సింగ్ (ఎస్బీఎస్ నగర్),అమృతపాల్ సింగ్ (హోషియార్పూర్)గా గుర్తించారు.
వీరు హోషియార్పూర్కు చెందిన ఓ ఏజెంట్ సహకారంతో మే 1న ఇరాన్కు వెళ్లినట్టు సమాచారం.
కానీ ఇరాన్కు చేరిన వెంటనే గుర్తు తెలియని వ్యక్తులు వారిని అపహరించి, చేతులను తాళ్లతో కట్టి వారి ఫోటోలు కుటుంబ సభ్యులకు పంపించారు.
వివరాలు
కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్న ఎంబసీ అధికారులు
వీరిని విడిచిపెట్టేందుకు రూ. కోటి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.మే 11 తర్వాత నుండి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు.
ఈవిషయాన్ని తెలుపుతూ వారు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా, ఎంబసీ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత సమాచారం ఇరాన్ ప్రభుత్వానికి అందజేశారు.
ముగ్గురి ఆచూకీ వెలికితీయాలని వారు ఇరాన్ అధికారులను కోరారు.
ఈప్రక్రియలో ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తాజా వివరాలను అందజేస్తున్నారని తెలుస్తోంది.
అయినప్పటికీ ఇంకా తమ బిడ్డల జాడ తెలియకపోవడం కుటుంబాలను భయాందోళనకు గురి చేస్తోంది.
ఇక ఈముగ్గురు యువకులను దుబాయ్-ఇరాన్ మార్గంలో ఆస్ట్రేలియాకు పంపిస్తానని హామీ ఇచ్చి, హోషియార్పూర్కు చెందిన ఓ ఏజెంట్ తీసుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
వివరాలు
ఇరాన్ పోలీసులు గాలింపులు
మొదట్లో ఇరాన్లో తాత్కాలిక బస కల్పిస్తానని కూడా ఏజెంట్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
కానీ మే 1న ఇరాన్కు అడుగుపెట్టిన వెంటనే ముగ్గురిని కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుంది.
అప్పటినుంచి ఆ ఏజెంట్ కూడా కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం అతని ఆచూకీ కోసం వారు తీవ్రంగా గాలిస్తున్నారని చెప్పారు. ఏజెంట్ గురించి సమాచారం లభిస్తే తమ బిడ్డల జాడ తెలిసే అవకాశముందని భావిస్తున్నారు.
కిడ్నాపర్లు డైరెక్ట్గా ఫోన్ చేసి రూ. కోటి డిమాండ్ చేస్తూ బెదిరించారని వారు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ ముగ్గురు యువకుల ఆచూకీ కోసం ఇరాన్ పోలీసులు గాలింపులు కొనసాగిస్తున్నారు.