US: అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లు అరెస్ట్.. త్వరలో స్వదేశానికి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయులను అమెరికా అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ అరెస్టులకు సంబంధించిన వివరాలను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఆ ప్రకటన ప్రకారం, గత నెలలో ఆరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 'ఆపరేషన్ చెక్మేట్' పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
వివరాలు
సెమీ ట్రక్ డ్రైవర్లుగా 36 మంది
ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న 52 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 36 మంది సెమీ ట్రక్ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అరెస్టయిన డ్రైవర్లలో 30 మంది భారతీయులు కాగా,మరో ఆరుగురు మెక్సికో,ఎల్ సాల్వడార్,రష్యా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద కాలిఫోర్నియా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల నుంచి జారీ చేసిన వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు.
వివరాలు
'ఆపరేషన్ చెక్మేట్'
అయితే కొందరి వద్ద ఎలాంటి చెల్లుబాటు అయ్యే లైసెన్సులు కూడా లేవని విచారణలో తేలింది. దీంతో ఫెడరల్ చట్టాల ప్రకారం వారిపై చర్యలు ప్రారంభించిన అధికారులు, త్వరలోనే వారిని అమెరికా నుంచి బహిష్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అరెస్టయిన 30 మంది భారతీయులు కూడా త్వరలో స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాగా, వాణిజ్య ట్రక్కులు నడుపుతూ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించడం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే 'ఆపరేషన్ చెక్మేట్' ప్రధాన లక్ష్యమని సీబీపీ పేర్కొంది.