Brazil: బ్రెజిల్లో పెను విషాదం.. విమానం కూలి 62 మంది మృతి
బ్రెజిల్లో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనస్మర్థం ఉన్న ప్రాంతంపై కూలింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ మృత్యువాత చెందారు. విమానం శిథిలాల నుంచి పెద్ద మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఓ ఇళ్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు.
విచారం వ్యక్తం చేసిన లుయూజ్ లులా
విమాన ప్రమాద ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు లుయూజ్ లులా డసిల్వా విచారం వ్యక్తం చేశారు. మృతులకు ఒక నిమిషం మౌనం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.