Page Loader
Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి 
ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి

Israel : ఇజ్రాయెల్‌ దాడిలో వైద్యురాలితో సహా 9 మంది పిల్లల మృతి 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన హింసాత్మక దాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాన్‌ యూనిస్‌ ప్రాంతానికి చెందిన నాస్సెర్‌ ఆసుపత్రిలో పని చేస్తున్న చిన్నారుల వైద్యురాలు 'నజ్జర్‌' కుటుంబం తీవ్రంగా ప్రభావితమైంది. శుక్రవారం విధుల్లో ఉన్న ఆమెకు తన నివాసం మంటల్లో కాలిపోతోందన్న సమాచారం రావడంతో వెంటనే ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ హృదయకరమైన దృశ్యాలు వెలుగుచూశాయి. ఆమె 9 మంది పిల్లలు మృతదేహాలుగా కనిపించారు. ఈ దుర్ఘటనలో నజ్జర్‌ భర్తతో పాటు మరో 11 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారని సమాచారం. మరణించిన పిల్లల వయసు 7 నెలల నుంచి 12 ఏళ్ల మధ్యగా ఉందని గాజా ఆరోగ్య శాఖ ప్రతినిధి ఖలీల్‌ అల్‌-డోఖ్రాన్‌ తెలిపారు.

Details

24 గంటల్లో 79 మంది మృతి

అందులో ఇద్దరు పిల్లలు శిథిలాల కింద పడి మరణించినట్టు పేర్కొన్నారు. శుక్రవారం, శనివారాల్లో 24 గంటల్లో జరిగిన వివిధ దాడుల్లో మొత్తం 79 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ దాడిపై ఇజ్రాయెల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌) స్పందించింది. ఖాన్‌ యూనిస్‌లో తమ దళాలకు సమీపంగా ఉన్న భవనంలో అనుమానిత మిలిటెంట్లు ఉన్నారని సమాచారంతోనే దాడికి దిగామని పేర్కొంది. ఈ ప్రాంతాన్ని ఇప్పటికే 'డేంజర్‌ జోన్‌'గా ప్రకటించి, అక్కడి ప్రజలందరినీ ఖాళీ చేయించినట్టు వివరించింది. అయినప్పటికీ ఈ దాడిపై సమీక్ష చేపడతామని వెల్లడించింది. అంతేకాకుండా శుక్రవారం ఒక్కరోజే 100 లక్ష్యాలపై దాడులు జరిపామని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఈ ఘటన మానవతా దృక్పథంలో తీవ్రమైన ఆవేదనకు, విమర్శలకు దారి తీస్తోంది.