LOADING...
Yemen: యెమెన్ తీరంలో మునిగిన ఆఫ్రికన్ వలసదారుల పడవ.. 68 మంది మృతి, 74 మంది గల్లంతు 
యెమెన్ తీరంలో మునిగిన ఆఫ్రికన్ వలసదారుల పడవ..68 మంది మృతి, 74 మంది గల్లంతు

Yemen: యెమెన్ తీరంలో మునిగిన ఆఫ్రికన్ వలసదారుల పడవ.. 68 మంది మృతి, 74 మంది గల్లంతు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
08:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికన్ వలసదారులతో వెళ్తున్న ఓ పడవ యెమెన్ తీరంలో ఆదివారం విషాదాన్ని మిగిల్చింది. మొత్తం 154 మంది ఉన్న ఆ పడవ బోల్తాపడిన ఘటనలో కనీసం 68 మంది మరణించారని, 74 మంది గల్లంతయ్యారని ఐక్యరాజ్య సమితి వలసల సంస్థ (IOM) తెలిపింది. యెమెన్ ఆరోగ్య శాఖ అధికారిగా ఉన్న అబ్దుల్ ఖాదిర్ బజమీల్ ప్రకారం, ఇప్పటి వరకు కేవలం 10 మందినే రక్షించగలిగామని వెల్లడించారు. రక్షించబడినవారిలో తొమ్మిది మంది ఇథియోపియన్లు కాగా, ఒకరు యెమెన్‌కు చెందిన వ్యక్తి అని పేర్కొన్నారు. మిగిలినవారి ఆచూకీ ఇప్పటికీ తెలియకుండా ఉందని విచారం వ్యక్తం చేశారు.

వివరాలు 

పడవలో ఉన్నవారు అందరూ ఇథియోపియా దేశానికి చెందిన వారు 

ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యెమెన్‌లోని అబ్యాన్ ప్రావిన్స్ పరిధిలోని అడెన్ గల్ఫ్‌లో చోటుచేసుకున్నట్లు IOM వెల్లడించింది. ఈ పడవలో ఉన్నవారు అందరూ ఇథియోపియా దేశానికి చెందిన వలసదారులని చెప్పింది. వారు గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లో ఉపాధి కోసం ఆశతో ప్రయాణించారని తెలిపింది. ఇథియోపియా, సోమాలియా వంటి దేశాల నుంచి వలసదారులు సముద్ర మార్గం ద్వారా యెమెన్ తీరానికి చేరే ప్రయత్నాలు చేయడం తరచూ కనిపిస్తుంది. అయితే ఈ మార్గం అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాల్లో ఒకటిగా IOM పేర్కొంది. గతంలోనూ ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరిగాయని, ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నామని తెలిపింది.

వివరాలు 

2024లో 558 మంది మరణించిన ఘటనలు

2024లో యెమెన్‌లోకి ప్రవేశించడానికి ఏకంగా 60,000 మందికి పైగా వలసదారులు తమ ప్రాణాలను పణంగా పెట్టారని IOM తెలిపింది గత ఏడాది ఈ మార్గంలో 558 మంది మరణించిన ఘటనలు నమోదయ్యాయి. గత 10 సంవత్సరాలలో మొత్తం 2082 మంది వలసదారులు కనపడకుండా పోయినట్లు నమోదు కాగా, వీరిలో 693 మంది మునిగిపోయినట్లు స్పష్టమైన రికార్డులు ఉన్నాయి.