
Pakistan: అమెరికా రాజకీయ నాయకులే అవినీతిపరులు : పాక్ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
ఓ వైపు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే, మరో వైపు ఆయన కేబినెట్ మంత్రులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతిపరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ మేము లంచాలు తీసుకున్నామని ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొన్నాం. కానీ అమెరికా రాజకీయ నాయకులు మాత్రం బహిరంగంగానే ఇజ్రాయెల్ నుంచి లంచాలు తీసుకున్నారు. నేనైతే లంచం తీసుకోవాల్సి వస్తే, దానిని చాటుగా తీసుకుంటాను. కానీ వారు బహిరంగంగానే స్వీకరించారు.
Details
భారత్ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదు
మేము నిందలు మోసాం, కానీ అమెరికా నేతలు పబ్లిక్గానే చేస్తున్నారని విరుచుకుపడ్డారు. అమెరికా మిలిటరీ అధికారులు, ప్రతినిధుల సభ సభ్యులు, ఉన్నతస్థాయి పాలకులు ఇజ్రాయెల్ నుంచి నిధులు అందుకున్నట్లు తామే అంగీకరించారని ఆసిఫ్ దుమ్మెత్తిపోశారు. ఇక మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కే షాక్ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు.
Details
ద్వైపాక్షిక అంశంగానే పాక్తో చర్చలు
అల్-జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దార్ మాట్లాడుతూ - భారత్ ద్వైపాక్షిక అంశంగానే పాక్తో చర్చలు జరుపుతామని చెప్పింది. మూడో పక్షం పాత్ర ఉన్నా మాకు అభ్యంతరం లేదు కానీ, భారత్ మాత్రం ఎప్పుడూ అంగీకరించదు. ఏ చర్చలైనా జరిగితే ఉగ్రవాదం, వాణిజ్యం, జమ్మూ-కాశ్మీర్పై సమగ్రంగా జరగాలని తెలిపారు. అదేవిధంగా మే 10న సీజ్ఫైర్ ఆఫర్ వచ్చినప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్-పాక్ చర్చలు తటస్థ వేదికపై జరుగుతాయని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కానీ జులై 25న మళ్లీ ప్రశ్నించగా, భారత్ మాత్రం దీనిని పూర్తిగా ద్వైపాక్షిక అంశంగానే చూస్తోందని రూబియో తేల్చి చెప్పారని ఇషాక్ దార్ వివరించారు