LOADING...
Asim Munir: 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాక్ కుదేలు.. దైవిక సాయమే కాపాడిందన్న ఆసిమ్ మునీర్
దైవిక సాయమే కాపాడిందన్న ఆసిమ్ మునీర్

Asim Munir: 'ఆపరేషన్ సిందూర్' దెబ్బకు పాక్ కుదేలు.. దైవిక సాయమే కాపాడిందన్న ఆసిమ్ మునీర్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' పాకిస్థాన్‌ను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై తాజాగా పాక్‌ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌,ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి. ఆ సంక్షోభ సమయంలో తమ దేశాన్ని 'దైవిక శక్తి' కాపాడిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఇస్లామాబాద్‌లో నిర్వహించిన నేషనల్‌ ఉలెమా కాన్ఫరెన్స్‌కు ఆసిమ్‌ మునీర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్‌గా మారాయి.

వివరాలు 

అఫ్గాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు

భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' కారణంగా పాకిస్థాన్‌ తీవ్రమైన నష్టాన్ని చవిచూసిన వేళ తమ సాయుధ దళాలకు దైవిక సహాయం అందిందని, ఆ అనుభూతిని తామంతా స్పష్టంగా గ్రహించామని మునీర్‌ పేర్కొన్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అదే వేదికపై అఫ్గాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో చిన్నారుల రక్తాన్ని అఫ్గాన్‌ చూస్తోందని ఆరోపించిన మునీర్‌, దేశంలో క్రియాశీలంగా ఉన్న తెహ్రీక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్థాన్‌ గుంపుల్లో సుమారు 70 శాతం మంది అఫ్గాన్‌ పౌరులేనని అన్నారు. తాలిబన్‌ ప్రభుత్వం ఇకనైనా సరిహద్దుల దాటి జరిగే ఉగ్రదాడులను ప్రోత్సహించకుండా ఆపాలని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

పహల్గాంలో ఉగ్రవాదులు ఘోర దాడి 26 మంది మృతి 

ఈ ఏడాది ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన ఘోర దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా మే 7న భారత్‌ పాకిస్థాన్‌ మరియు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్‌ సిందూర్‌'ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ దాడుల్లో ఉగ్ర శిబిరాలతో పాటు పాక్‌ సైనిక స్థావరాలను కూడా భారత సేనలు నేలమట్టం చేశాయి. ఈ వరుస దాడులతో తీవ్రంగా నష్టపోయిన పాకిస్థాన్‌ చివరకు చర్చలకు సిద్ధమైంది. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు భారత్‌ వైమానిక దాడులను నిలిపివేయడంతో ఆపరేషన్‌కు తెరపడింది. ఈ పరిణామాలన్నీ దక్షిణాసియాలో మరోసారి ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారాయి.

Advertisement