Pakistan: ఉగ్రవాదాన్ని ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం.. భారత్పై మునీర్ కొత్త కుట్ర
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్పై ఆరోపణల మోత పెంచుతూ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు సమాచారం. తన దేశంలో తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ), బలూచిస్తాన్ విమోచన సైన్యం (బీఎల్ఏ) జరుపుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ సమస్యలు పాకిస్థాన్ స్వయంకృతాపరాధాల ఫలితమని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, మునీర్ ఈ ప్రచారాన్ని ఉద్దేశపూర్వకంగా ఉధృతం చేస్తున్నారని భారత నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వారి అంచనా ప్రకారం, జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను మళ్లీ భారత్పై దాడులకు ప్రేరేపించడమే మునీర్ అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
వివరాలు
ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్పై ఆరోపణలు
'ఆపరేషన్ సిందూర్' అనంతరం పాకిస్థాన్ సైన్యం పరువు దెబ్బతినడంతో మునీర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సమాచారం. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్కు ముందు "భారత్ను తూర్పు నుంచి నాశనం చేయడం ప్రారంభిస్తామంటూ ఆయన చేసిన ప్రకటనలు గట్టిగా వినిపించాయి. కానీ ఆ ఆపరేషన్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఇప్పుడు దేశంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్పై ఆరోపణలు చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం జైష్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు పునరేకీకరణ దిశగా కదులుతున్నప్పటికీ, అది పాక్ సైన్యం, ఐఎస్ఐ ఆశించిన స్థాయిలో లేదని నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
దాడులకు పురగొల్పడానికి ప్రయత్నాలు
ఐఎస్ఐ నిధులు, వనరులు సమకూరుస్తున్నా, ఆ సంస్థల నాయకత్వంలో నైతిక ధైర్యం తగ్గిందని, వెంటనే భారత్పై దాడులు చేసేందుకు అవి సిద్ధంగా లేవని తెలుస్తోంది. అందువల్ల వారిలో భారత్పై ద్వేషాన్ని పెంచి దాడులకు పురిగొల్పడానికే మునీర్ ఈ ఆరోపణలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లతో వ్యవహారంలో కూడా మునీర్ వ్యూహం విఫలమైంది. ఆ వైఫల్యంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు కూడా భారత్పై విమర్శలను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని విశ్లేషణలు సూచిస్తున్నాయి. కశ్మీర్లో దాడులు చేయడంలో అనుభవం ఉన్న లష్కర్, జైష్లను రంగంలోకి దించకుండా పాకిస్థాన్ తన ప్రాక్సీ యుద్ధాన్ని కొనసాగించడం కష్టమని భావిస్తోంది.
వివరాలు
భారత సైన్యం అప్రమత్తంగా ఉండాలి
అందుకే ఆ సంస్థల్లో మళ్లీ ఉత్సాహాన్ని రగిలించేందుకు ఈ ప్రచారాన్ని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సరిహద్దుల్లో భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉండటంతో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు విఫలమవుతున్నాయి. అయినప్పటికీ, పాకిస్థాన్లో పెరుగుతున్న నిరాశ, మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో కశ్మీర్లో పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశాన్ని నిఘా వర్గాలు కొట్టిపారేయడం లేదు.