Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. ఢాకా ప్యాలెస్ విడిచి పెట్టి సురక్షిత ప్రాంతానికి
బంగ్లాదేశ్లో మళ్లీ హింస చెలరేగడంతో ప్రధాని షేక్ హసీనా ఢాకా ప్యాలెస్ను విడిచి పెట్టి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లారు. ఆందోళనలు ఉద్ధృతం కావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం విడిచి వెళ్లారని స్థానిక మీడియా వెల్లడించింది. ప్రధాని హసీనాకు సన్నిహితుడైన మంత్రి నుంచి అంతర్జాతీయ వార్తా సంస్థ AFPకి అందిన సమాచారం ప్రకారం, హసీనా, ఆమె సోదరి గణభాబన్ (ప్రధాని అధికారిక నివాసం) వదిలి సురక్షిత ప్రదేశానికి వెళ్లారు. కుర్మిటోలా వైమానిక స్థావరం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రధాని దేశం విడిచి వెళ్లిపోయారని ఆర్మీ హెలికాప్టర్ వీడియోను స్థానికులు పంచుకున్నారు.
ప్రసంగాన్ని రికార్డ్ చేయడం సాధ్యపడలేదు
ఏజెన్సీ ప్రకారం, దేశం విడిచి వెళ్ళే ముందు ప్రధాని హసీనా తన ప్రసంగాన్ని రికార్డ్ చేయాలనుకున్నారు, కానీ ఆమెకు ఆ అవకాశం రాలేదు. మరోవైపు, పెరుగుతున్న హింస దృష్ట్యా, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు ప్రధాని హసీనా అధికారిక నివాసమైన గణభాబన్ను ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు.. అక్కడ విధ్వంసం సృష్టించారు. ప్రధాని హసీనా దేశం విడిచి ఏదైనా ఐరోపా దేశంలో తలదాచుకునే అవకాశం ఉంది. 1971 యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాల పిల్లలకు బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు 30 శాతం కోటాను కేటాయిస్తూ షేక్ హసీనా సర్కారు తీసుకున్ననిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు.