సెప్టెంబర్ 8న మోదీ-బైడెన్ ద్వైపాక్షిక సమావేశం: వైట్హౌస్ వెల్లడి
దిల్లీ వేదికగా సెప్టెంబర్ 9,10తేదీల్లో జరగనున్న జీ20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ పాల్గొనేందుకు 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు. అదేరోజు ప్రధాని నరేంద్ర మోదీతో బైడెన్ సమావేశం కానున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొంది. సమ్మిట్ సందర్భంగా జీ20కి నాయకత్వం వహిస్తున్నందుకు మోదీని బైడెన్ ప్రశంసిస్తారని వైట్ హౌస్ తెలిపింది. సెప్టెంబర్ 7న బైడెన్ అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి బయలుదేరనున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం, పేదరికంపై మెరుగ్గా పోరాడటానికి ప్రపంచ బ్యాంకుతో సహా బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.