JD Vance: ఇజ్రాయెల్కు జేడీ వాన్స్ హెచ్చరిక.. ట్రంప్ను విమర్శిస్తే నష్టమే!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్కు బలమైన మద్దతుగా నిలుస్తున్న నాయకుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యుడని, అలాంటి మిత్రదేశ అధినేతను బహిరంగంగా విమర్శించడం ఇజ్రాయెల్కు ఏమాత్రం ప్రయోజనకరం కాదని హెచ్చరించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులను, అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆ దేశ నాయకత్వం వాస్తవికంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని వాన్స్ సూచించారు. వివాదాలను మరింత పెంచడం కంటే దౌత్యపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 14సూత్రాల అవగాహన ఒప్పందం
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 14సూత్రాల అవగాహన ఒప్పందానికి వైట్ హౌస్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఇందులో హర్మూజ్ జలసంధి దిగ్బంధనాన్ని తొలగించడం,అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలు ఉన్నాయి. ఈచర్య ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని అమెరికా భావిస్తోంది. ఈసందర్భంగా ఇజ్రాయెల్ రక్షణ కోసం అవసరమయ్యే ఆయుధాల్లో మూడింట రెండు వంతులు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనే సమకూరుతున్నాయని వాన్స్ గుర్తు చేశారు. కేవలం సైనిక చర్యలు,దాడుల ద్వారా అన్ని భద్రతాసవాళ్లకు పరిష్కారం లభించదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాలను నియంత్రించే దిశగా ప్రతిపాదించిన 60రోజుల చర్చల కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని,దీనిపై ఇజ్రాయెల్ క్యాబినెట్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు అవసరానికి మించినవేనని వ్యాఖ్యానించారు.
వివరాలు
బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్లోని మితవాద మంత్రులు తీవ్ర అభ్యంతరం
మరోవైపు, ఈ ఒప్పందం ఇరాన్కు ఆర్థికంగా ఊరటనిస్తుందనే కారణంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్లోని మితవాద మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవగాహన ఒప్పందం వల్ల లెబనాన్కు చెందిన హిజ్బుల్లా కార్యకలాపాలు లేదా ఇరాన్ అణు ఆశయాలను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదని వారు వాదిస్తున్నారు. అమెరికాతో కొన్ని అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినప్పటికీ, ఈ ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించలేదు. రానున్న రోజుల్లో స్విట్జర్లాండ్లో జరగనున్న ఉన్నతస్థాయి చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను తగ్గించి, పశ్చిమాసియాలో దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడమే తమ లక్ష్యమని అమెరికా వర్గాలు భావిస్తున్నాయి.