Typhoon Dolphin: చైనాను వణికిస్తున్న'డాల్ఫిన్' తుపాను.. సురక్షిత ప్రాంతాలకు 10 లక్షల మంది
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో భారీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. టైఫూన్ డాల్ఫిన్ తీరాన్ని తాకడంతో తూర్పు చైనాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దేశ ఆర్థిక రాజధాని షాంఘైలోనూ భారీ వర్షాలు,బలమైన గాలుల ప్రభావం కనిపించింది. తుపాను కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక్క షాంఘైలోనే సోమవారం దాదాపు 1,000 విమానాలను రద్దు చేశారు. డాల్ఫిన్ తుపాను తీవ్రత ప్రస్తుతం తగ్గినప్పటికీ.. దాని ప్రభావం మాత్రం కొనసాగుతుందని అధికారులు హెచ్చరించారు. బుధవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు.
వివరాలు
చైనాలో డాల్ఫిన్ తుపాను బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ
ఈ ఏడాది చైనాను తాకిన తుపానుల్లో డాల్ఫిన్ అత్యంత తీవ్రమైనదని అధికారులు తెలిపారు. తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముందుగానే రెడ్ అలర్ట్ను జారీ చేశారు.
జెజియాంగ్ ప్రావిన్స్లోని యుహువాన్ ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు డాల్ఫిన్ తొలిసారి తాకింది.
ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
ఆ తర్వాత గంటలోనే వెన్జౌ నగరం సమీపంలో రెండోసారి తీరాన్ని తాకింది.
సోమవారం షాండోంగ్, హెనాన్, హుబెయి, అన్హుయి, జియాంగ్సు, జెజియాంగ్ ప్రావిన్సులతో పాటు షాంఘైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వివరాలు
తుపాను ధాటికి షాంఘైలో వరదలు.. బాలుడు గల్లంతు
తుపాను నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని స్థానిక ప్రభుత్వాలు సూచించాయి.
ప్రముఖ పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. షాంఘైలోని డిస్నీల్యాండ్, లెగోల్యాండ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు బండ్ ప్రాంతంలోని పలు వ్యూ పాయింట్లను కూడా మూసివేశారు.
షాంఘైలోని మాజీ ఫ్రెంచ్ కన్సెషన్ ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న దుకాణాల్లోకి వరద నీరు చేరిన దృశ్యాలు చైనా ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.
పలువురు మోకాలి కింది లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. జెజియాంగ్లోని వెన్లింగ్కు చెందిన తొమ్మిదేళ్ల బాలుడు సముద్రంలోకి కొట్టుకుపోయినట్లు పలు ప్రభుత్వ మీడియా సంస్థలు తెలిపాయి.
అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు.
వివరాలు
జెజియాంగ్లో భారీ వర్షాల హెచ్చరిక.. 12.9 లక్షల మందికి సురక్షిత ప్రాంతాలకు తరలింపు
రానున్న రోజుల్లో జెజియాంగ్లోని కొన్ని ప్రాంతాల్లో 250 నుంచి 500 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
జెజియాంగ్ రాజధాని హాంగ్జౌలో తుపాను ప్రభావంతో బలమైన గాలులు, వరద నీటి నుంచి రక్షణ కోసం వాహనాలతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లే వారికి అన్ని ప్రభుత్వ పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ ఫీజును రద్దు చేశారు.
వెన్జౌలో సుమారు 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 1,000కుపైగా అత్యవసర ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తైజౌ నగరంలో మరో 3.9 లక్షల మందిని ఇళ్ల నుంచి తరలించినట్లు అధికారులు తెలిపారు.
వివరాలు
ఫుజియాన్లో ముందస్తు చర్యలు.. 6,000 కి.మీ. ప్రయాణించిన డాల్ఫిన్ తుపాను
తీర ప్రాంతమైన ఫుజియాన్ ప్రావిన్స్లోనూ ముందస్తు చర్యలు చేపట్టారు.
అక్కడ సముద్ర రవాణా అధికారులు పలు ప్రయాణికుల ఫెర్రీ మార్గాలను నిలిపివేశారు.
సముద్రంలో జరుగుతున్న 100కుపైగా నిర్మాణ ప్రాజెక్టుల పనులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
డాల్ఫిన్ తుపాను తీరాన్ని తాకడానికి ముందు సుమారు 6,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది.
సాధారణ తుపానుతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ కాలం కొనసాగినట్లు పేర్కొంది.
తుపాను పరిధి కూడా భారీగా ఉందని, అత్యంత తీవ్రమైన వర్షాలను కురిపించే సామర్థ్యం దీనికి ఉందని తెలిపింది.
వివరాలు
తుపానుపై ఫేక్ వీడియోలు.. ఇద్దరి అరెస్టు
ఇదిలా ఉండగా.. తుపానుకు సంబంధించి చైనా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపించినట్లు ప్రభుత్వ మీడియా పేర్కొంది.
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది.
వారిలో 60 ఏళ్ల వ్యక్తి ఏఐ సాయంతో నకిలీ వీడియో రూపొందించి, తుపాను సమయంలో షాంఘైలో ఓ వ్యక్తి భవనం నుంచి పడిపోయినట్లు ప్రచారం చేశాడు.
మరో 32 ఏళ్ల వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ఇతరులు పోస్ట్ చేసిన తుపాను వీడియోలను మార్చి తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేసినట్లు అధికారులు తెలిపారు.
చైనాను తాకే ముందు డాల్ఫిన్ ఫిలిప్పీన్స్, ఉత్తర తైవాన్, జపాన్లోని ఒకినావా ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిపించింది.
వివరాలు
జపాన్లోనూ డాల్ఫిన్ ప్రభావం.. ఐదుగురు వృద్ధులకు గాయాలు
డాల్ఫిన్తో పాటు వారం ప్రారంభంలో వచ్చిన ఇతర తుపానుల ప్రభావంతో ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలు కురిశాయి.
దీంతో ఎనిమిది మంది మృతి చెందినట్లు అక్కడి పౌర రక్షణ కార్యాలయం తెలిపింది. దేశవ్యాప్తంగా 7,000 మందికిపైగా ప్రజలు సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు.
జపాన్లోని ఒకినావాలో తుపాను ప్రభావంతో ఐదుగురు వృద్ధులకు గాయాలయ్యాయి.
అయితే వారి పరిస్థితి ప్రమాదకరంగా లేదని స్థానిక ప్రభుత్వం తెలిపింది. వీరిలో ముగ్గురు బలమైన గాలుల కారణంగా కిందపడిపోయినట్లు పేర్కొంది.
వివరాలు
హాంకాంగ్లో రికార్డు ఉష్ణోగ్రత.. ఎల్నినోతో తుపాన్ల తీవ్రతకు అవకాశం
మరోవైపు హాంకాంగ్లోనూ తుపాను ప్రభావం కనిపించింది.
డాల్ఫిన్ కారణంగా వేడి గాలులు నగరాన్ని తాకడంతో ఆదివారం అక్కడ 36.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది అక్కడ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతగా నమోదైంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో సాధారణంగా మే నుంచి అక్టోబర్ వరకు తుపాన్ల సీజన్ కొనసాగుతుంది.
ఈ కాలంలో టైఫూన్లు తరచుగా ఏర్పడుతుంటాయి. ఈ ఏడాది బలమైన ఎల్నినో పరిస్థితులు ఉన్నాయని, దీంతో ఏర్పడే తుపాన్లు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.