China: చైనా కొత్త ప్రయాణ నిబంధనలు.. టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎగ్జిట్ బ్యాన్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే.. ఇకపై చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకోవచ్చు. ఈ మేరకు చైనా తీసుకొచ్చిన కొత్త ప్రవేశ,నిష్క్రమణ నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. జులైలో చైనా స్టేట్ కౌన్సిల్ జారీ చేసిన ఈ నిబంధనలు మంగళవారం నుంచి అమలులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎగుమతి నియంత్రణలు,సాంకేతికత దిగుమతి-ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా దేశ పారిశ్రామిక లేదా సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న సందర్భాల్లో చైనా పౌరుల విదేశీ ప్రయాణాన్ని పరిమితం చేసేందుకు ఈ నిబంధనలు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నాయి. అయితే,ఈ విభాగంలో ప్రయాణ నిషేధం ఎంతకాలం ఉండాలనే విషయాన్ని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొనలేదు.
వివరాలు
టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘిస్తే.. దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకట్ట
విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో చైనా పౌరులపై ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు ప్రయాణ ఆంక్షలు విధించవచ్చు.
చైనా జాతీయ భద్రత లేదా ప్రయోజనాలకు నష్టం కలిగించే చట్టవిరుద్ధ లేదా నేరపూరిత కార్యకలాపాల్లో విదేశాల్లో పాల్గొన్నవారికి ఈ నిబంధన వర్తిస్తుంది.
అలాగే,ప్రయాణ పత్రాలను అక్రమంగా పొందడం,అక్రమంగా దేశంలోకి ప్రవేశించడం లేదా దేశం నుంచి బయటకు వెళ్లడం వంటి చర్యలకు శిక్షపడిన కొందరిపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
ఎగుమతి నియంత్రణలు లేదా సాంకేతికత దిగుమతి-ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తి చర్యలు జాతీయ పారిశ్రామిక లేదా సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించవచ్చని సంబంధిత ప్రభుత్వ విభాగాలు భావిస్తే.. ఆ వ్యక్తి దేశం విడిచి వెళ్లకుండా నిర్ణయం తీసుకోవచ్చు.
వివరాలు
తప్పుడు సమాచారంపై కఠిన చర్యలు..
ఈ నిబంధనలో ఈ తరహా నిషేధానికి నిర్దిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు.
ప్రయాణ దరఖాస్తుల విషయంలోనూ నిబంధనలు కఠినతరం చేశారు.
తప్పుడు పత్రాలు సమర్పించినా,తప్పుడు వివరాలు వెల్లడించినా ఇమ్మిగ్రేషన్,వీసా అధికారులు ప్రయాణ పత్రాలను జారీ చేయకుండా నిరాకరించవచ్చు.
ప్రవేశం లేదా నిష్క్రమణను కూడా అడ్డుకోవచ్చు. వీసా దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన విదేశీయులను ఒకటి నుంచి ఐదేళ్ల వరకు చైనాలోకి రాకుండా నిషేధించే అవకాశం ఉంది.
చైనా గత కొన్నేళ్లుగా కొందరు ప్రభుత్వ అధికారులు,ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల విదేశీ ప్రయాణాలపై అదనపు ఆంక్షలు విధిస్తోంది.
ముఖ్యంగా రహస్య సమాచారం అందుబాటులో ఉన్న ఉద్యోగులపై ఈ నియంత్రణలు ఎక్కువగా ఉన్నాయి.
వివరాలు
చైనా కొత్త ట్రావెల్ రూల్స్పై తైవాన్ ఆందోళన.. బీజింగ్ ఏమందంటే?
2023లో రాయిటర్స్ కథనం ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ యాజమాన్య లేదా ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేసేవారి వ్యక్తిగత విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు, విదేశీ సంబంధాలపై నిఘా పెరిగింది.
కొత్త నిబంధనలపై తైవాన్లోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ముఖ్యంగా చైనాలోని సాంకేతిక రంగంలో పనిచేస్తున్న తైవాన్ ప్రజలపై వీటి ప్రభావం ఉండొచ్చని తైవాన్ మెయిన్ల్యాండ్ అఫైర్స్ కౌన్సిల్ పేర్కొంది.
ఎగుమతి నియంత్రణలు, సాంకేతికత నిర్వహణకు సంబంధించిన కారణాలతో ప్రయాణాలను పరిమితం చేసే విషయంలో చైనా అధికారులకు ఈ నిబంధనలు మరింత విచక్షణాధికారాన్ని కల్పించవచ్చని తెలిపింది.
అయితే, బీజింగ్ ఈ ఆందోళనలను తోసిపుచ్చింది. తైవాన్ ప్రజలకు ఈ నిబంధనలు మెరుగైన చట్టపరమైన రక్షణ కల్పిస్తాయని పేర్కొంది.
వివరాలు
అధిక ప్రమాద ప్రాంతాలకు వెళ్లొద్దని సూచన
ప్రవేశ, నిష్క్రమణ నిర్వహణను మెరుగుపరచడం, దేశ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడటమే కొత్త నిబంధనల ఉద్దేశమని చైనా అధికారులు చెబుతున్నారు.
అధిక ప్రమాదం ఉన్న దేశాలు, ప్రాంతాలకు ప్రయాణించే విషయంలో చైనా పౌరులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అప్రమత్తం చేయాలని ప్రభుత్వం సూచించింది.
ప్రమాదం తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ప్రయాణించకుండా ప్రజలకు సూచించాలని కూడా పేర్కొంది.