Iran: 'పాము తల నరికేశాం': ఇరాన్ గార్డుల ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశామని అమెరికా సైన్యంలో కీలక విభాగమైన సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. "పాము తలను నరికేశాం" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ దాడి తర్వాత ఐఆర్జీసీకి కేంద్ర కార్యాలయం అంటూ ఏదీ మిగల్లేదని స్పష్టం చేసింది. ఆదివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో సెంట్కామ్ ఈ వివరాలను వెల్లడించింది. "గత 47 సంవత్సరాల్లో ఐఆర్జీసీ చర్యల వల్ల 1,000మందికి పైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. నిన్న చేపట్టిన భారీ దాడితో ఆ పాము తలను తెగగొట్టాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అమెరికాదే" అని పేర్కొంది.
వివరాలు
ఈ ఘర్షణల్లో ముగ్గురు అమెరికా సైనికులు మృతి చెందినట్లు నిర్ధారణ
ఇజ్రాయెల్తో కలిసి అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరిట శనివారం నుంచి ఇరాన్పై సంయుక్త సైనిక చర్యలు ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు ఉన్నతస్థాయి సైనికాధికారులు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్ల దాడులు కొనసాగిస్తోంది. 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో ఇప్పటివరకు తమ సైనికుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని సెంట్కామ్ అధికారికంగా ధృవీకరించింది. ఇరు దేశాలు దాడులు కొనసాగిస్తామని ప్రకటించడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి పరిస్థితి తారాస్థాయికి చేరింది.