LOADING...
#NewsBytesExplainer: చైనా అణు పరీక్షలపై అనుమానాలు… నిపుణులేమంటున్నారు?
చైనా అణు పరీక్షలపై అనుమానాలు… నిపుణులేమంటున్నారు?

#NewsBytesExplainer: చైనా అణు పరీక్షలపై అనుమానాలు… నిపుణులేమంటున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

గాల్వాన్ ఘర్షణ తర్వాత 2020లో చైనా అణు పరీక్ష నిర్వహించిందా అనే అంశంపై అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది. అమెరికా-రష్యాల మధ్య ఉన్న చివరి అణు ఒప్పందం న్యూ స్టార్ట్ ముగియడంతో అణు ఆయుధాల పోటీ మళ్లీ మొదలవుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికా, 2020లో చైనా రహస్యంగా అణు పేలుడు పరీక్షలు చేసిందని ఆరోపించింది. జెనీవాలో జరిగిన నిరాయుధీకరణ సదస్సులో అమెరికా ఉన్నతాధికారి థామస్ డినాన్నో మాట్లాడుతూ, వందల టన్నుల శక్తితో అణు పరీక్షలకు చైనా సిద్ధమైందని, జూన్ 22, 2020న ఒక పరీక్ష కూడా జరిగిందని చెప్పారు. ఇది గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికులు ఎదురెదురుగా నిలిచిన ఘటనకు కేవలం వారం రోజుల తర్వాతేనని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

అణు పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదన్న సీటిబీటీఓ

అయితే చైనా మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. అమెరికా చెబుతున్నవి అన్నీ అసత్య ఆరోపణలేనని, అణు పరీక్షలు నిర్వహించబోమన్న తమ వాగ్దానానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టంగా ప్రకటించింది. అణు పరీక్షలను పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ సీటిబీటీఓ కూడా, ఆ సమయంలో అణు పేలుడుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు తమకు లభించలేదని తెలిపింది. అయితే కొన్ని తక్కువ శక్తి గల పరీక్షలు పర్యవేక్షణకు చిక్కకుండా ఉండే అవకాశముందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

కొత్త అణు ఒప్పందం కుదిరితేనే ప్రపంచానికి ఊరట

మరోవైపు, చైనా అణు ఆయుధాల నిల్వను, క్షిపణి వ్యవస్థలను వేగంగా విస్తరిస్తోందన్న విషయం మాత్రం నిపుణులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం చైనాకు సుమారు 600 అణు వార్‌హెడ్లు ఉన్నాయని, రాబోయే దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెరికా అంచనాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త అణు ఒప్పందం కుదిరితేనే ప్రపంచానికి ఊరట కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement