LOADING...
Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికాపై ఫైర్
రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు..అమెరికాపై ఫైర్

Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికాపై ఫైర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై విమర్శలు చేస్తున్న అమెరికా, యూరప్‌ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు అదుపులో ఉండేందుకు రష్యా చమురు కొనుగోలు చేయాలని స్వయంగా అమెరికానే భారత్‌కు సూచించిందని ఆయన వెల్లడించారు. ఫిన్లాండ్‌ పర్యటన సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన జైశంకర్‌కు ఓ జర్నలిస్టు రష్యాపై భారత్‌ ఎక్కువ సానుభూతి చూపుతోందని, భారీగా రష్యా చమురును కొనుగోలు చేస్తోందని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. చమురు కొనుగోలు చేసే సమయంలో తాము రాజకీయాలు చూడమని, ధరతో పాటు సరఫరా అందుబాటులో ఉండటమే ప్రధాన ప్రమాణాలని స్పష్టం చేశారు.

వివరాలు 

రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నందుకు భారత్‌పై టారిఫ్‌లు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి అనంతరం అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు మాస్కోపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయని జైశంకర్ గుర్తుచేశారు. ఆ తర్వాత యూరప్‌ దేశాలు పశ్చిమాసియా దేశాల నుంచి చమురును ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభించగా,భారత్‌కు అందుబాటులో ఉన్న ప్రధాన సరఫరాదారుగా రష్యా నిలిచిందన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగానే భారత్‌ ఆ దిశగా అడుగులు వేసిందని వివరించారు. రష్యా చమురు అంశంలో అమెరికా వ్యవహరించిన తీరును కూడా ఆయన ప్రశ్నించారు. ఒక దశలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నందుకు భారత్‌పై టారిఫ్‌లు విధించారని, అనంతరం పరిస్థితులు మారడంతో వాటినే సడలించారని గుర్తుచేశారు. ఇందులో ఎలాంటి గొప్ప నైతిక విలువలు లేవని, రాజకీయ, ఆర్థిక అవసరాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి.. ఆంక్షలను సడలించిన అమెరికా

అలాంటి చర్యలకు నైతికత ముసుగు వేయడం సరికాదన్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై 50 శాతం వరకు టారిఫ్‌లు విధించగా, అందులో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు 25 శాతం అదనపు సుంకం కూడా ఉన్నట్లు జైశంకర్ ప్రస్తావించారు. అయితే ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో ఆ ఆంక్షలను అమెరికా తర్వాత సడలించిందని తెలిపారు.

Advertisement

వివరాలు 

యూరప్‌ దేశాల ద్వంద్వ వైఖరిపై విమర్శలు

యూరప్‌ దేశాల ద్వంద్వ వైఖరిపై కూడా జైశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌పై దాడులకు ఉపయోగించే ఆయుధాలను యూరప్‌లోని పలు దేశాలు దశాబ్దాలుగా విక్రయిస్తున్నాయని అన్నారు. భారత ఆయుధాలతో యూరప్‌లోని ఏ దేశంపైనా దాడులు జరగలేదని, కానీ యూరప్‌ నుంచి సరఫరా అయిన ఆయుధాలు మాత్రం భారత్‌పైకి వస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాల్లో ఒకే విధమైన ప్రమాణాలు పాటించకుండా, తమకు అనుకూలంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని పాశ్చాత్య దేశాలకు ఆయన సూచించారు.

Advertisement