Israel warns Iranians: రైలు ప్రయాణాలకు దూరంగా ఉండండి: ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని రైల్వే వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్ సైన్యం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) తమ అధికారిక పర్షియన్ భాష 'ఎక్స్' ఖాతా ద్వారా కీలక సూచనలు చేశాయి. వచ్చే 12 గంటల పాటు దేశవ్యాప్తంగా రైలు ప్రయాణాలు చేయకుండా ఉండాలని, అలాగే రైల్వే మార్గాల సమీపంలో నివసించే లేదా ఉండే ప్రజలు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని సూచించాయి.
వివరాలు
అత్యవసర హెచ్చరికగా ఈ ప్రకటన
"మీ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకు (ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం) రైల్వే మార్గాలకు దగ్గరగా ఉండవద్దు. రైలు ప్రయాణాలను పూర్తిగా నివారించండి. ఎవరైనా ఆ ప్రాంతాల్లో ఉంటే వారి ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంది" అని హెచ్చరికలో పేర్కొంది. ఈ ప్రకటనను అత్యవసర హెచ్చరికగా పేర్కొన్న ఐడీఎఫ్, దాడులు జరిగే ప్రాంతాలపై మాత్రం స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, ఈ హెచ్చరికలపై ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.