Data centres: యూఏఈ,బహ్రెయిన్లోని క్లౌడ్ యూనిట్లలో నిలిచిన సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్కు చెందిన డేటా సెంటర్లలో కనెక్టివిటీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. యూఏఈ, బహ్రెయిన్లలో పనిచేస్తున్న అమెజాన్ క్లౌడ్ విభాగం డేటా సెంటర్లలో సేవలు నిలిచిపోవడం గణనీయమైన చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ఇరాన్ నుంచి డ్రోన్ దాడులు జరిగాయని సమాచారం రావడంతో, ఈ డేటా సెంటర్లనే లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్లో సేవా అంతరాయాలు
వివరాల్లోకి వెళ్తే.. ముందుగా యూఏఈలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ పరిసరాల్లో అనుమానాస్పద వస్తువు పడటంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చినా, విద్యుత్ సరఫరా అంతరాయం కలగడంతో క్లౌడ్ సేవలు నిలిచిపోయాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అమెజాన్ వెల్లడించింది. అలాగే వినియోగదారులు ఇతర ప్రత్యామ్నాయ జోన్లను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ సంఘటన జరిగిన కొద్ది గంటలకే బహ్రెయిన్లోని అమెజాన్ డేటా సెంటర్లోనూ ఇలాంటి సేవా అంతరాయాలు నమోదయ్యాయి.
వివరాలు
అంతరాయాలకు ఇరాన్ డ్రోన్ దాడులే కారణం
అయితే ఈ రెండు ఘటనలకు గల ఖచ్చితమైన కారణాలపై అమెజాన్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ అంతరాయాలకు ఇరాన్ డ్రోన్ దాడులే కారణమని పేర్కొంటున్నాయి. ఇటీవల ఇరాన్పై దాడుల సందర్భంలో అమెరికా సైన్యం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో ఆంథ్రోపిక్ రూపొందించిన క్లాడ్ ఏఐని వినియోగించిందని వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ అమెజాన్ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.