Ebola: కాంగోలో ఎబోలా కలకలం.. రెండు రోజుల్లో రెట్టింపైన కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ ఆందోళన కలిగిస్తోంది. తూర్పు ప్రాంతంలోని ఇటురి ప్రావిన్స్లో గుర్తించిన ఈ మహమ్మారి కేవలం రెండు రోజుల్లోనే ఊహించని స్థాయిలో విస్తరించింది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ స్వయంగా పర్యవేక్షణలో పాల్గొంటున్నారు.
వివరాలు
బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది
కాంగోలో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అధికారిక వివరాల ప్రకారం 48 గంటల వ్యవధిలోనే బాధితుల సంఖ్య 121 నుంచి 225కు చేరుకుంది. ప్రస్తుతం వెయ్యికి పైగా అనుమానిత కేసులు నమోదు కాగా, 220 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ వైరస్ 'బుండిబుగ్యో' రకానికి చెందినదిగా గుర్తించారు. ఇది అత్యంత అరుదైన, ప్రమాదకరమైన ఎబోలా వేరియంట్గా పరిగణించబడుతోంది. ఈ వైరస్కు ఇప్పటివరకు సమర్థవంతమైన టీకా లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడంతో వైద్య నిపుణులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
నియంత్రణ చర్యలకు ప్రజల సహకారం కరువు
ఎబోలా వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రజల సహకారం కీలకంగా మారింది. అయితే వైరస్పై ఉన్న అపోహలు, భయాలు, స్థానిక సంప్రదాయాలు ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలకు అడ్డంకిగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో పాటించాల్సిన భద్రతా నిబంధనలను అమలు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న ఘర్షణలు, భద్రతా సమస్యలు వైద్య బృందాల పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక కార్యక్రమాలు నిర్వహించడం కూడా సవాలుగా మారింది.
వివరాలు
ఉగాండాకు విస్తరించిన వైరస్
ఎబోలా ప్రభావం ఇప్పుడు కాంగోకే పరిమితం కాలేదు. పొరుగు దేశమైన ఉగాండాలో కూడా కేసులు నమోదవ్వడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 'అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి'గా ప్రకటించింది. అమెరికా, ఐరోపా సమాఖ్య సహా పలు దేశాలు ఆర్థిక, వైద్య సహాయాన్ని అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రస్తుతం అందుతున్న నిధులు సరిపోవడం లేదని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఎబోలా నియంత్రణలో విఫలమైతే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.