Qatar: ఖతార్కు భారీ షాక్.. రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో పేలుడు,54 మందికి గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ సహజ వాయువు వాణిజ్యంలో అత్యంత కీలక స్థానాన్ని కలిగిన ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంలో ఉన్న బర్జాన్ ప్లాంట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది గాయపడినట్లు సమాచారం. మరో 18 మంది ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. పేలుడు అనంతరం ప్లాంట్ పరిసరాల్లో భారీ మంటలు చెలరేగడంతో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
వివరాలు
యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న వేళ ప్రమాదం
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన సమయంలో ఐఆర్జీసీ దళాలు ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఆ ఘటనల కారణంగా గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా దెబ్బతింది. అనంతరం పరిస్థితులు కొంతమేర సద్దుమణగడంతో గ్యాస్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ఖతార్ చర్యలు చేపట్టింది. ఈ తరుణంలోనే తాజా పేలుడు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
వ్యూహాత్మకంగా కీలకమైన రస్ లఫాన్
ఖతార్ రాజధాని దోహాకు ఈశాన్య దిశలో సుమారు 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతంలో రస్ లఫాన్ నగరం ఉంది. భౌగోళికంగా అత్యంత ప్రాధాన్యమున్న ఈ ప్రాంతం ఆసియా, యూరప్ దేశాలకు గ్యాస్ ఎగుమతుల ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా 30కుపైగా దేశాలకు ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. జపాన్, దక్షిణ కొరియా, భారత్, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు రస్ లఫాన్ నుంచి సరఫరా అయ్యే గ్యాస్పై అధికంగా ఆధారపడుతున్నాయి. దీంతో ఈ కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన అంతర్జాతీయ ఇంధన మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాలు
భారత్కు కీలకమైన ఖతార్ గ్యాస్
భారత్ దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీలో సుమారు 40 నుంచి 47 శాతం వరకు ఖతార్ నుంచే వస్తోంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారత్కు చేరుతుంది. రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రాన్ని ఖతార్ ఎనర్జీ సంస్థ నిర్వహిస్తోంది. భారత్-ఖతార్ మధ్య 2024లో సుమారు 78 బిలియన్ డాలర్ల విలువైన దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం 2028 నుంచి 20 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని భారత్కు సరఫరా చేయనున్నారు.
వివరాలు
భారత ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతు
ఖతార్ నుంచి దిగుమతి అయ్యే ఎల్ఎన్జీ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీ, పారిశ్రామిక అవసరాలు, గృహ వినియోగం వంటి అనేక రంగాలకు కీలకంగా ఉపయోగపడుతోంది. అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఖతార్ నుంచి గ్యాస్ రవాణా ఖర్చులు తక్కువగా ఉండటంతో భారత్కు ఇది అత్యంత ప్రయోజనకరమైన సరఫరా వనరుగా నిలిచింది.