Race back to US: సెప్టెంబర్ 15లోగా యూఎస్కు చేరండి.. భారత విద్యార్థులకు కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న భారత విద్యార్థులకు ఇమ్మిగ్రేషన్ నిపుణులు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సెలవుల కోసం భారత్తో పాటు ఇతర దేశాలకు వెళ్లిన ఎఫ్-1 విద్యార్థి వీసాదారులు తప్పనిసరిగా సెప్టెంబర్ 15లోగా అమెరికాకు తిరిగి చేరుకోవాలని సూచిస్తున్నారు. కారణం.. అదే తేదీ నుంచి అమెరికాలో కొత్త విద్యార్థి వీసా నిబంధనలు అమల్లోకి రానుండటమే. సెప్టెంబర్ 15 నాటికి అమెరికాలోనే ఉండి, ఎఫ్-1 వీసా నిబంధనలను సక్రమంగా పాటిస్తున్న విద్యార్థులకు ప్రస్తుతం అమల్లో ఉన్న'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ (డి/ఎస్)' విధానం కొనసాగుతుంది. దీంతో వారు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు ఇప్పటి వరకు ఉన్న వెసులుబాటు కొనసాగనుంది.
వివరాలు
నాలుగేళ్ల బసకు కూడా ప్రత్యేక షరతులు
అయితే ఆ తేదీ తర్వాత అమెరికాకు చేరుకునే విద్యార్థులకు మాత్రం కొత్త నిబంధనలు వర్తిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కొత్త విధానం ప్రకారం సెప్టెంబర్ 15 తర్వాత అమెరికాలో ప్రవేశించే ఎఫ్-1 విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు స్వయంచాలకంగా ఉండే అవకాశం ఉండదు.
వారి ఐ-94 రికార్డులో నిర్దిష్ట గడువును నమోదు చేస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉంటుంది.
ఆ గడువు ముగిసిన తర్వాత అక్కడే కొనసాగాలంటే మళ్లీ అనుమతి కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
అయితే సెప్టెంబర్ 15 నాటికి అమెరికాలో ఉండి, ఎఫ్-1 వీసా నిబంధనలను పాటిస్తున్న వారికి మాత్రమే పాత డి/ఎస్ విధానం వర్తిస్తుంది.
వివరాలు
సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి కొత్త వీసా విధానం
ఈ వెసులుబాటు కూడా శాశ్వతం కాదని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెప్టెంబర్ 15 తర్వాత ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి ప్రవేశిస్తే, అప్పటి నుంచి కొత్త వీసా నిబంధనలే అమల్లోకి వస్తాయని చెబుతున్నారు.
అలాగే నాలుగేళ్ల వరకు అనుమతి లభిస్తుందనే కారణంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించడం కూడా సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థి తన కోర్సును కొనసాగించడం,ఎఫ్-1 వీసాకు సంబంధించిన అన్ని నిబంధనలను నిరంతరం పాటించడం వంటి అంశాల ఆధారంగానే అమెరికాలో ఉండేందుకు అనుమతి కొనసాగుతుంది.
అందువల్ల ప్రస్తుతం సెలవుల కోసం స్వదేశానికి వచ్చిన భారత విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ 15లోగా అమెరికాకు తిరిగి వెళ్లేలా ప్రయాణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.