
US: ఫోర్డో అణుకేంద్రం నేలమట్టం..? అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడి!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ అణుకేంద్రాలపై తీవ్ర దాడులకు పాల్పడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ బాంబులు వేసినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. "భారీ బాంబులను ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. మా విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదు. ఇప్పుడు శాంతికి సమయం" అని ట్రంప్ పోస్ట్ చేశారు. తదుపరి మరో పోస్ట్లో 'ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సేనతో కలిసే ఈ దాడిని చేసినట్టు ట్రంప్ వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్ విమానాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని ఆయన తెలిపారు.
Details
రెండు వారాల గడువును రెండు రోజుల్లోనే పూర్తి చేసిన ట్రంప్
ట్రంప్ మొదట ఇరాన్కు రెండు వారాల గడువు ఇచ్చారు. కానీ ఆయన రెండు రోజులు కూడా ఆగకుండానే చర్యకు దిగారు. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మన్ ఎయిర్బేస్ నుంచి మరిన్ని బీ-2 స్పిరిట్ బాంబర్లు, 8 కెసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని డియాగో గార్సియా వైపు బయల్దేరాయి. ఫ్లైట్ రాడార్ 24 ప్రకారం, ఇవి 'మైటీ-11', 'మైటీ-21' అనే కాల్సైన్లను ఉపయోగించాయి. గతంలో కూడా ప్రత్యేక ఆపరేషన్లలో బీ-2 స్పిరిట్స్ ఇలాంటి 'మైటీ' కాల్సైన్లనే ఉపయోగించాయి.
Details
యుద్ధంలో అమెరికా ప్రవేశం.. శ్వేతసౌధం ప్రకటన
ఈ దాడుల నేపథ్యంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. శ్వేతసౌధం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ చర్యలతో అమెరికా కూడా యుద్ధరంగంలోకే అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మరిన్ని దాడులకు అమెరికా యోచించడం లేదని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ మద్దతుతోనే ఆపరేషన్ ఈ ప్రణాళికలో పూర్తిస్థాయి సహకారం అందించినట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. దాడిని ఇస్ఫహాన్ డిప్యూటీ గవర్నర్ అక్బర్ సలేహి కూడా ధ్రువీకరించారు. ఇస్ఫహాన్, నతాంజ్ వద్ద పలు పేలుళ్లు సంభవించినట్టు ఆయన చెప్పారు.
Details
ఫోర్డో అణుకేంద్రం ప్రాముఖ్యత
క్వామ్ నగరానికి అతి సమీపంలో ఉన్న ఫోర్డో అణుకేంద్రం ఇరాన్ అణుశక్తి ప్రణాళికలో అత్యంత ముఖ్యమైనది . 1981లో బాగ్దాద్ వద్ద ఇజ్రాయెల్ ఎఫ్-15, ఎఫ్-16 యుద్ధవిమానాలు అణుకేంద్రాన్ని ధ్వంసం చేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుని, ఫోర్డో కేంద్రాన్ని పర్వతాల లోతులో రక్షణాత్మకంగా నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7 శాతం శుద్ధిచేసిన యురేనియాన్ని గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన అణుబాంబుల్లో ఉపయోగించే 90 శాతం శుద్ధి చేసిన యురేనియానికి ఇది చాలా దగ్గరగా ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసినప్పటికీ, ఇలా శుద్ధిచేసిన యురేనియం ఉత్పత్తి చేయడం నిబంధనలకు విరుద్ధం.