Pakistan Fuel Prices: పాకిస్థాన్లో ఇంధన ధరల రికార్డు పెంపు.. లీటర్ డీజిల్ రూ. 520
ఈ వార్తాకథనం ఏంటి
పొరుగు దేశమైన పాకిస్థాన్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలకు తీవ్ర భారంగా మారాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచుతూ కీలక నిర్ణయం తీసుకోగా, కొత్త ధరలు శుక్రవారం (ఏప్రిల్ 3) నుంచి వెంటనే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపు ప్రకారం హై-స్పీడ్ డీజిల్ లీటర్ ధర రూ. 184.49 (54.9 శాతం) పెరిగి రూ. 520.35కు చేరింది. అదే సమయంలో పెట్రోల్ ధర లీటర్కు రూ. 137.23 (42.7 శాతం) పెరిగి రూ. 458.40కు ఎగిసింది. నెల రోజుల వ్యవధిలోనే ఇంధన ధరలు రెండోసారి పెరగడం గమనార్హం.
వివరాలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే పెంపుకు కారణం
ఈ పెంపుకు కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమేనని ప్రభుత్వం వెల్లడించింది. ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం తప్పదని పేర్కొంది. ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్, పెట్రోలియం శాఖ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. "అంతర్జాతీయ ధరల ప్రభావాన్ని పూర్తిగా తప్పించలేము. అయితే బలహీన వర్గాలపై ప్రభావం తగ్గించేలా చర్యలు తీసుకుంటాం" అని ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ తెలిపారు.
వివరాలు
20 లీటర్ల వరకు లీటర్పై రూ. 100 సబ్సిడీ
భారీ ధరల పెంపు నేపథ్యంలో సాధారణ ప్రజలకు కొంత ఉపశమనంగా ప్రభుత్వం లక్ష్యిత సబ్సిడీలను ప్రకటించింది. ద్విచక్ర వాహనదారులకు మూడు నెలల పాటు నెలకు 20 లీటర్ల వరకు లీటర్పై రూ. 100 సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అదనంగా చిన్న రైతులు, ప్రజా రవాణా వాహనాలకు కూడా ప్రత్యేక ఉపశమన చర్యలు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.