
Trump Tariffs: భారత్, చైనా దిగుమతులపై సుంకాల విధింపునకు జీ7 గ్రీన్సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పే దిశగా రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో, రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని యూఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదన మేరకు భారత్, చైనా దిగుమతులపై టారిఫ్లు విధించాలని ఈయూ, జీ7 దేశాలకు సూచనలు చేసింది. తాజాగా జరిగిన పరిణామాల్లో జీ7 దేశాలు ఈ సుంకాల విధింపునకు అంగీకరించినట్లు సమాచారం. జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టారిఫ్ల అంశంపై చర్చ సాగింది.
Details
భారత్ దిగుమతులపై భారీ సుంకాలు
అనంతరం అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు నిజంగా కట్టుబడి ఉంటే.. రష్యాపై ఒత్తిడి తీసుకురావాల్సిందే. అందుకోసం ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాపై సుంకాలు విధించాలన్న ట్రంప్ ప్రతిపాదనలను మేము ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కూడా దేశాలను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఇప్పటికే అమెరికా భారత్ దిగుమతులపై భారీ సుంకాలు విధించింది. ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.
Details
చైనాపై టారిఫ్ల విధింపునకు ఆయా దేశాలు సిద్ధం
అదేవిధంగా, యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామంటూ జీ7 సభ్యదేశాలు చేసిన ప్రకటనను అమెరికా స్వాగతించింది. దీనివల్ల భారత్, చైనాపై టారిఫ్ల విధింపునకు ఆయా దేశాలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రతిపాదనను ట్రంప్ ఇంతకుముందు ఐరోపా సమాఖ్య (ఈయూ) ముందు కూడా ఉంచిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఈయూ దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో అమలులోకి రాలేదు. ఇప్పుడు అదే ప్రతిపాదనను మళ్లీ జీ7 దేశాల ముందుకు తెచ్చిన ట్రంప్ ప్రయత్నం గమనార్హమైంది.