LOADING...
G7 Summit 2026: ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!
ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!

G7 Summit 2026: ఫ్రాన్స్‌లో ప్రపంచ నేతల భేటీ.. అందరి దృష్టి ఈ కీలక ద్వైపాక్షిక సమావేశాలపైనే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 15, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రాన్స్‌లోని సరస్సు తీర పట్టణం ఎవియన్-లే-బెయిన్‌లో 52వ G7 సదస్సు నేటి (జూన్ 15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచ వాణిజ్యం,ఆర్థిక స్థిరత్వం,కృత్రిమ మేధ (AI),కీలక ఖనిజాల భద్రత వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. అయితే అధికారిక సమావేశాలతో పాటు వివిధ దేశాధినేతల మధ్య జరిగే ద్వైపాక్షిక సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. G7 కూటమిలో కెనడా,ఫ్రాన్స్,జర్మనీ,ఇటలీ,జపాన్,బ్రిటన్,అమెరికా,యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ఆతిథ్య దేశమైన ఫ్రాన్స్ భారత్,బ్రెజిల్,ఈజిప్ట్,కెన్యా,దక్షిణ కొరియా,ఖతార్,సౌదీ అరేబియా,సిరియా, ఉక్రెయిన్,యూఏఈ దేశాలను ప్రత్యేక ఆహ్వానిత భాగస్వాములుగా ఆహ్వానించింది. దీంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సహా పలువురు అగ్రనేతలు ఒకే వేదికపై కనిపించనున్నారు.

వివరాలు 

జూన్ 17న డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ సమావేశం 

ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న భేటీగా డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోదీ సమావేశాన్ని భావిస్తున్నారు. ఈ ఏడాది తొలిసారిగా ఇద్దరు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండగా, జూన్ 17న ఈ సమావేశం జరగనుంది. గతంలో వీరు 2025 ఫిబ్రవరిలో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు, సుంకాల విధానం, సాంకేతిక భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా ఉండే అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు,పాశ్చాత్య దేశాల మధ్య భారత్ ఒక కీలక వారధిగా వ్యవహరిస్తుందని, గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను తాము G7 వేదికపై వినిపిస్తామని మోదీ ఇప్పటికే పేర్కొన్నారు.

వివరాలు 

ద్వైపాక్షిక ఒప్పందాలకే ప్రాధాన్యం ఇస్తున్న ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగే భేటీ కూడా ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. G7ను తిరిగి తన అసలు లక్ష్యాలకు అనుగుణంగా తీసుకెళ్లాలని,ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ, ఇంధన భద్రత అంశాలపై సభ్య దేశాలు సమిష్టిగా ముందుకు సాగాలని మాక్రాన్ భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ద్వైపాక్షిక ఒప్పందాలకే ప్రాధాన్యం ఇస్తూ వస్తుండటంతో ఈ సమావేశం ఇరుదేశాల దృక్కోణాలకు ఒక పరీక్షగా మారనుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ట్రంప్ ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్ దేశాధినేతలతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రాంతీయ భద్రత, అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థ స్థిరీకరణ, సముద్ర వాణిజ్య మార్గాల రక్షణ వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉండనున్నాయి.

Advertisement

వివరాలు 

యూరప్ నేతలతో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్న కెనడా ప్రధాని

కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా యూరప్ నేతలతో పలు కీలక సమావేశాలు నిర్వహించే అవకాశముంది. ప్రపంచ రాజకీయాల్లో అగ్రశక్తుల మధ్య ఉన్న మధ్యస్థ దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన గతంలోనే అభిప్రాయపడ్డారు. ఈ G7 సదస్సు ద్వారా అలాంటి దేశాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి కార్నీ ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

ద్వైపాక్షిక సమావేశాల ఫలితాలపై ప్రపంచ దేశాల ఆసక్తి

మరోవైపు,ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీకి ఫ్రాన్స్ ఆహ్వానం పంపినప్పటికీ, ఆయనకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం ఉండదని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు. అయితే G7 వర్కింగ్ సెషన్‌లో ఇతర నేతలతో కలిసి ట్రంప్, జెలెన్స్కీ పాల్గొనే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఏడాది G7 సదస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రత, అంతర్జాతీయ రాజకీయాలపై కీలక నిర్ణయాలకు వేదిక కానుండగా, వివిధ దేశాధినేతల మధ్య జరిగే ద్వైపాక్షిక సమావేశాల ఫలితాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Advertisement