'Guardian of the world': ట్రూత్ సోషల్లో ట్రంప్ AI పోస్టులు వైరల్.. 'ట్రంప్ 2028'పై చర్చ జోరు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో కృత్రిమ మేధ (AI)సాయంతో రూపొందించిన పలు చిత్రాలను పంచుకోవడంతో అవి సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. అమెరికా సైనిక శక్తిని ప్రతిబింబించే చిత్రాలతో పాటు'ట్రంప్2028'నినాదం కనిపించే పోస్టర్లు కూడా ఇందులో ఉండటంతో,ఆయన భవిష్యత్ రాజకీయాలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ AI చిత్రాల్లో ఎక్కువ భాగం ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. 'గార్డియన్స్ ఆఫ్ ది వరల్డ్'అనే శీర్షికతో ఉన్న ఒక చిత్రంలో ట్రంప్ వెనుక అమెరికా స్టెల్త్ ఫైటర్ జెట్లు కనిపిస్తుండగా,అవి'ఇరాన్'అని గుర్తించిన లక్ష్యాలపై దాడి చేస్తున్నట్లు చిత్రీకరించారు. మరో చిత్రంలో ఇరాన్కు చెందిన ఖర్గ్ ఐలాండ్ ఆయిల్ టెర్మినల్పై దాడి చేసినట్లుగా చూపించారు.
వివరాలు
ట్రంప్ రాజకీయ సందేశాలు ఉన్న పోస్టర్లను కూడా షేర్ చేశారు
అలాగే, ఒక ఇరానియన్ ఆయిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నట్లు చూపిస్తూ 'ఇది ఇప్పుడు మా ఆయిల్ ట్యాంకర్!' అనే వ్యాఖ్యను జోడించిన చిత్రం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
సైనిక అంశాలకు సంబంధించిన చిత్రాలతో పాటు ట్రంప్ రాజకీయ సందేశాలు ఉన్న పోస్టర్లను కూడా షేర్ చేశారు.
అమెరికా వ్యవస్థాపక పితామహులు జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్లతో కలిసి నిలబడి ఉన్నట్లుగా రూపొందించిన AI చిత్రానికి 'అమెరికా ఫస్ట్' అనే నినాదాన్ని జత చేశారు.
మరికొన్ని పోస్టర్లలో 'ట్రంప్ 2028', 'ప్లాన్ ట్రస్టెడ్' వంటి ట్యాగ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వివరాలు
ప్రస్తుతం చర్చకు అమెరికాలో 'ట్రంప్ 2028' నినాదం
ఇదిలా ఉండగా, 'ట్రంప్ 2028' నినాదం అమెరికాలో ప్రస్తుతం విస్తృత చర్చకు కారణమైంది.
అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం, ఒక వ్యక్తి గరిష్ఠంగా రెండు పర్యాయాలు మాత్రమే అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉంది.
ఈ నిబంధనలో మార్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి.
అందుకోసం కాంగ్రెస్ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది.
అనంతరం దేశంలోని 50 రాష్ట్రాల్లో కనీసం 38 రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం.
ఈ మొత్తం ప్రక్రియ అత్యంత క్లిష్టమైనదిగా, రాజకీయపరంగా సవాళ్లతో కూడుకున్నదిగా భావిస్తున్నారు.