LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో 81 అడుగుల రాముడి విగ్రహానికి బ్రేక్.. అసలు కారణం ఇదే!
బంగ్లాదేశ్‌లో 81 అడుగుల రాముడి విగ్రహానికి బ్రేక్.. అసలు కారణం ఇదే!

Bangladesh: బంగ్లాదేశ్‌లో 81 అడుగుల రాముడి విగ్రహానికి బ్రేక్.. అసలు కారణం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 18, 2026
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో 81 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఇస్లామిస్ట్‌ తీవ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో గైబాంధా జిల్లాలోని పలాశ్‌బారిలో చేపట్టిన ఈ ప్రాజెక్టును ఆలయ కమిటీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఒక మత ఛాందసవాది 'ప్రభుత్వం కూల్చకపోతే బుల్డోజర్‌తో విగ్రహాన్ని నేలమట్టం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామం బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కులు, మత స్వేచ్ఛపై మరోసారి చర్చకు దారితీసింది.

వివరాలు

రాముడి విగ్రహ ప్రాజెక్టు ఏమిటి?

బంగ్లాదేశ్ ఉత్తర ప్రాంతంలోని గైబాంధా జిల్లా పలాశ్‌బారిలో శ్రీశ్రీ రాధా గోవింద ఆలయ సముదాయంలో భాగంగా భారీ విగ్రహాల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 220 మిలియన్ టాకాలు (దాదాపు రూ.15.6 కోట్లు). ప్రాజెక్టులో భాగంగా 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం 30 అడుగుల శివుడి విగ్రహం నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. 81 అడుగుల రామ విగ్రహం పూర్తయితే అది బంగ్లాదేశ్‌లోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహంగా నిలిచేది.

వివరాలు

బెదిరింపులతో పనులు నిలిపివేత

ఆలయ కమిటీ అధ్యక్షుడు హరిదాస్ చంద్ర దాస్ మాట్లాడుతూ, "సనాతన ధర్మానికి ప్రధాన శక్తి ప్రతీక అయిన శ్రీరాముడికి అంకితంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. కానీ కొన్ని తీవ్రవాద గ్రూపులు నిర్మాణాన్ని ఆపాలని ఒత్తిడి తెస్తున్నాయి. మాకు భయం వేసింది. అందుకే పనులను నిలిపివేశామని తెలిపారు. ప్రధాని తారిఖ్ రెహ్మాన్, చట్ట అమలు సంస్థలు, పౌర సమాజం జోక్యం చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకునేలా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ సలహాదారు శ్యామలాల్ కుమార్ మహంతా మాట్లాడుతూ, "సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకే తాత్కాలికంగా పనులు ఆపుతున్నాం. ఎవరి మతభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని చెప్పారు.

Advertisement

వివరాలు

బుల్డోజర్‌తో కూల్చేస్తామన్న బెదిరింపు

ఈ నెల ప్రారంభంలో వైరల్ అయిన వీడియోలో ఒక మత ఛాందసవాది, "రాముడి విగ్రహం నిర్మిస్తున్నారు. బుల్డోజర్‌తో కూల్చేయాలి. ప్రభుత్వం చేయకపోతే సామాన్య ముస్లిములే దాన్ని ధ్వంసం చేస్తారని హెచ్చరించాడు. దేశవ్యాప్తంగా ఆగ్రహం విగ్రహ నిర్మాణం నిలిపివేయడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు.

Advertisement

వివరాలు

బెదిరింపులను ఖండించిన రచయిత్రి

ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఈ బెదిరింపులను ఖండించారు. ఆమె ఎక్స్‌లో చేసిన పోస్టులో, "ఇతర మతాల ప్రార్థనా స్థలాలను తమకు నచ్చలేదని ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదు. చట్టపరిపాలన ఉన్న దేశంలో మత విభేదాలను హింసతో పరిష్కరించరని పేర్కొన్నారు. ఇంకా, "రాముడి విగ్రహాన్ని కూల్చాలని పిలుపునివ్వడం తాలిబాన్ మానసికతకు నిదర్శనం. 2001లో తాలిబాన్ బామియన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసింది. ఇప్పుడు గైబాంధాలో రామ విగ్రహాన్ని కూల్చేస్తామన్న బెదిరింపుల్లో అదే మనస్తత్వం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

వివరాలు

ప్రభుత్వాన్ని కోరిన మైనారిటీ సంస్థలు

బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ కేంద్ర కమిటీ ఈ బెదిరింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని తారిఖ్ రెహ్మాన్ ప్రభుత్వాన్ని కోరింది. మైనారిటీల భద్రతపై మళ్లీ చర్చ ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రత అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. హిందూ-బౌద్ధ-క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ వివరాల ప్రకారం, ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య 133 మతపరమైన హింసా ఘటనలు నమోదయ్యాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతులైన తర్వాత హిందువులపై దాడులు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ కాలంలోనూ పలు హిందూ వ్యక్తుల అరెస్టులు, హత్యలు చోటుచేసుకున్నాయి.

వివరాలు

తారిఖ్ రెహ్మాన్ హామీ ఏమిటి?

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని అయిన తారిఖ్ రెహ్మాన్ తన తొలి ప్రసంగంలో, "ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు — మతం, పార్టీ, అభిప్రాయం, జాతి తేడా లేకుండా ప్రతి పౌరుడికి సురక్షితమైన దేశంగా బంగ్లాదేశ్‌ను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అయితే పలాశ్‌బారి ఘటన నేపథ్యంలో ఆ హామీ అమలు ఎంతవరకు జరుగుతోందన్న ప్రశ్నలు ఇప్పుడు బంగ్లాదేశ్‌లో వినిపిస్తున్నాయి.

Advertisement