Hantavirus: క్రూయిజ్ నౌకలో 'హాంటావైరస్' వ్యాప్తి.. ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ నౌకలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ నౌకలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ ఆదివారం వెల్లడించింది. వీరిలో ఒకరికి హాంటావైరస్ సోకినట్టు ప్రయోగశాల పరీక్షల్లో నిర్ధారణ అయింది. సాధారణంగా ఈ వైరస్ ఎలుకలు వంటి రోడెంట్ల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్రబలిన నౌక MV హోండియస్. ఇది అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి కేప్ వెర్డేకు ప్రయాణిస్తోంది. ఇప్పటివరకు ఒక కేసు హాంటావైరస్గా నిర్ధారించగా, మరో ఐదు అనుమానాస్పద కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మొత్తం ఆరుగురిలో ముగ్గురు మృతి చెందగా, ఒకరు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వివరాలు
మరో వ్యక్తికి ఐసీయూలో చికిత్స
దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ ప్రకారం, ఈ నౌకలో "తీవ్ర శ్వాసకోశ వ్యాధి" వ్యాప్తి చెందింది. కనీసం ఇద్దరు మరణించగా, మరో వ్యక్తి జోహానెస్బర్గ్లో ఐసీయూలో ఉన్నారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగిలో హాంటావైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రభుత్వ ప్రతినిధి ఫోస్టర్ మొహాలే వెల్లడించారు. ఈ వైరస్ రక్తస్రావ జ్వరం (హీమరేజిక్ ఫీవర్)కు కారణమయ్యే అవకాశం ఉంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, హాంటావైరస్ సాధారణంగా సంక్రమిత ఎలుకల మూత్రం లేదా విసర్జనలతో పరిచయం వల్ల వ్యాపిస్తుంది. అయితే అరుదుగా మనుషుల మధ్య కూడా వ్యాపించే అవకాశం ఉందని, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉండటంతో రోగులను జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
వివరాలు
నౌకలోనే ఓ ప్రయాణికుడు మృతి
ఈ ఘటనలో మొదట లక్షణాలు కనిపించిన వ్యక్తి 70 ఏళ్ల ప్రయాణికుడు. ఆయన నౌకలోనే మృతి చెందగా, ఆయన మృతదేహాన్ని దక్షిణ అట్లాంటిక్లోని బ్రిటిష్ భూభాగం సెయింట్ హెలెనా దీవిలో ఉంచారు. ఆయన 69 ఏళ్ల భార్య కూడా అదే నౌకలో అనారోగ్యానికి గురై, దక్షిణాఫ్రికాకు తరలించగా, జోహానెస్బర్గ్ ఆసుపత్రిలో మృతి చెందారు. వీరి జాతీయతను ఇంకా నిర్ధారించలేదు. మూడో కేసు 69 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తికి సంబంధించినది. ఆయనను కూడా జోహానెస్బర్గ్కు తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, డచ్ దంపతులు మృతులలో ఉన్నారని ఒక వర్గం తెలిపింది. మూడో మృతదేహం ఇంకా నౌకలోనే ఉందని సమాచారం.
వివరాలు
కానరీ దీవుల వైపు ప్రయాణం కొనసాగించే అవకాశం
ఇంకా అనారోగ్యంతో ఉన్న ఇద్దరు ప్రయాణికులను కేప్ వెర్డేలో ఆసుపత్రిలో ఐసోలేషన్లో ఉంచాలా లేదా అనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. అనంతరం నౌక స్పెయిన్కు చెందిన కానరీ దీవుల వైపు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. లక్షణాలు ఉన్న ఇద్దరు ప్రయాణికులను వైద్య చికిత్స కోసం తరలించేందుకు సంబంధిత దేశాల అధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఈ MV హోండియస్ ఒక పోలార్ క్రూయిజ్ నౌకగా పలు ట్రావెల్ వెబ్సైట్లలో నమోదైంది. దీనిని నెదర్లాండ్స్కు చెందిన ఓషన్వైడ్ ఎక్స్పెడిషన్స్ నిర్వహిస్తోంది. ఉషువాయా నుంచి కేప్ వెర్డే వరకు ప్రయాణించే ఈ టూర్లో సౌత్ జార్జియా, సెయింట్ హెలెనా దీవుల్లో నిలిచే షెడ్యూల్ ఉంటుంది.
వివరాలు
నన
నౌకలో సుమారు 170 మంది ప్రయాణికులు, 70 మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఈ నౌక కేప్ వెర్డే రాజధాని ప్రైయా తీరానికి సమీపంలో ఉన్నట్లు నౌక ట్రాకింగ్ వెబ్సైట్లు వెల్లడిస్తున్నాయి. హాంటావైరస్ ప్రధానంగా ఎలుకలు, ఎలుకల విసర్జన, లేదా కాలుష్య ధూళి ద్వారా మనుషులకు సోకుతుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు రకాల హాంటావైరస్లు ఉండి, వాటి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. ఈ ఘటనపై స్పందించేందుకు క్రూయిజ్ నిర్వాహక సంస్థ ఓషన్వైడ్ ఎక్స్పెడిషన్స్ను సంప్రదించగా, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.