Ren Zhengfei: కొత్త ఎగ్జిట్ రూల్స్ వేళ హువావే సీఈఓ చైనా వీడారంటూ రూమర్లు
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్ జెంగ్ఫీ దేశం విడిచిపోయారా? టెక్ కంపెనీలపై ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తున్న సమయంలో ఆయన కుటుంబంతో కలిసి చైనాను వీడారా? ప్రస్తుతం సోషల్మీడియాలో ఈ ప్రశ్నలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. హువావే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులను మోహరించారన్న వార్తలు కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయని పలు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వివరాలు
సెప్టెంబర్ 15 నుంచి కొత్త ప్రయాణ ఆంక్షలు
టెక్నాలజీ సంస్థలను దృష్టిలో ఉంచుకుని విదేశీ ప్రయాణాలకు సంబంధించి చైనా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది.
ఈ నిబంధనల ప్రకారం.. జాతీయ భద్రత లేదా సాంకేతిక భద్రతకు ముప్పుగా భావించే చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది.
అలాంటి వ్యక్తుల విదేశీ ప్రయాణాలను అడ్డుకునే అధికారాన్ని ఈ నిబంధనలు అక్కడి అధికారులకు కల్పిస్తాయి.
ఈ నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే రెన్ జెంగ్ఫీ దేశం వీడారన్న ప్రచారం తెరపైకి రావడం గమనార్హం.
వివరాలు
సముద్ర మార్గంలో కుటుంబంతో కలిసి వెళ్లారంటూ ప్రచారం
రెన్ జెంగ్ఫీ తన కుటుంబంతో కలిసి సముద్ర మార్గంలో చైనా నుంచి వెళ్లిపోయారని అక్కడి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
కొత్త ఎగ్జిట్ కంట్రోల్ నిబంధనలు అమల్లోకి రావడానికి కొద్ది రోజుల ముందే ఆయన దేశం విడిచారని ప్రచారం సాగుతోంది.
మరోవైపు, షెన్జెన్లోని హువావే ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఈ వాదనలను ఇప్పటివరకు ఎవరూ ధ్రువీకరించలేదు.
వివరాలు
సముద్ర మార్గంలో కుటుంబంతో కలిసి వెళ్లారంటూ ప్రచారం
హువావే సంస్థ నుంచి గానీ, చైనా అధికారిక వర్గాల నుంచి గానీ ఈ ప్రచారంపై ఎలాంటి స్పష్టత రాలేదు.
కనీసం ఖండన కూడా వెలువడకపోవడం గమనార్హం. గతంలో ప్రభుత్వ ఒత్తిళ్ల నేపథ్యంలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా కూడా కొంతకాలం బహిరంగంగా కనిపించకుండా ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హువావే సీఈఓ రెన్ జెంగ్ఫీ దేశం వీడారన్న ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే ఆయన ప్రయాణానికి సంబంధించిన వాదనలను నిర్ధారించే స్వతంత్ర ఆధారాలు ఇప్పటివరకు వెలుగులోకి రాలేదు.