Humanoid robots: జపాన్ ఎయిర్పోర్ట్లో బ్యాగేజీ హ్యాండ్లర్లుగా హ్యూమనాయిడ్ రోబోలు.. మే నుంచి ట్రయల్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్లోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటైన టోక్యో హనెడా ఎయిర్పోర్ట్లో త్వరలో హ్యూమనాయిడ్ రోబోలు బ్యాగేజీ హ్యాండ్లర్లుగా పనిచేయనున్నాయి. ఇప్పటికే పనిభారం ఎక్కువగా ఉన్న సిబ్బందికి తోడ్పాటుగా ఈ రోబోలను ప్రవేశపెట్టేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు ప్రారంభించారు. అయితే వీటికి మధ్య మధ్యలో రీచార్జింగ్ విరామాలు అవసరం అవుతాయి. జపాన్ ఎయిర్లైన్స్ (JAL) మే ప్రారంభం నుంచి ట్రయల్ ప్రాతిపదికన ఈ హ్యూమనాయిడ్ రోబోలను ఉపయోగించనుంది. దేశంలో కొనసాగుతున్న కార్మికుల కొరతకు శాశ్వత పరిష్కారంగా వీటిని భవిష్యత్తులో పూర్తిస్థాయిలో వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ను చేపట్టింది.
వివరాలు
కార్గో సరుకులు తరలించే పనుల్లో రోబోలు..
చైనాలో తయారైన ఈ రోబోలు హనెడా విమానాశ్రయంలో రన్వే పరిసర ప్రాంతాల్లో ప్రయాణికుల సామాను, కార్గో సరుకులను తరలించే పనులు చేస్తాయి. ప్రతి సంవత్సరం 6 కోట్లకుపైగా ప్రయాణికులను హనెడా ఎయిర్పోర్ట్ సేవలందిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్న జపాన్ ఎయిర్లైన్స్ GMO ఇంటర్నెట్ గ్రూప్తో కలిసి JAL ఈ ప్రయోగాన్ని 2028 వరకు కొనసాగించనుంది. భవిష్యత్తులో కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థలు భావిస్తున్నాయి. ఈ వారం హాంగ్జౌ కేంద్రంగా ఉన్న యూనిట్రీ సంస్థ తయారు చేసిన 130 సెంటీమీటర్ల ఎత్తున్న రోబోను చూపించారు. అది JAL ప్రయాణికుల విమానం పక్కన కన్వేయర్ బెల్ట్పై కార్గోను నెమ్మదిగా నెట్టుతూ పనిచేయడం, అలాగే మరో సహచరుడికి చేతులు ఊపడం కనిపించింది.
వివరాలు
ఉద్యోగులకు తగ్గనున్న పనిభారం..
JAL గ్రౌండ్ సర్వీస్ అధ్యక్షుడు యోషితేరు సుజుకి మాట్లాడుతూ.. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులను రోబోలతో చేయించడం వల్ల ఉద్యోగులపై భారం తప్పకుండా తగ్గుతుందని, వారికి మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అయితే భద్రతా నిర్వహణ వంటి కీలక బాధ్యతలు మాత్రం మనుషులే నిర్వహిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇక జపాన్ ప్రస్తుతం ఒకేసారి రెండు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటోంది. విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతుండగా, మరోవైపు దేశ జనాభా వృద్ధాప్యంలోకి వెళ్లడం, జనాభా తగ్గిపోవడం కొనసాగుతోంది.
వివరాలు
పర్యాటకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం, 2026 తొలి రెండు నెలల్లోనే 70 లక్షలకు పైగా మంది దేశాన్ని సందర్శించారు. గత ఏడాది మొత్తం 4.27 కోట్ల మంది జపాన్కు వెళ్లారు. అయితే టోక్యో-బీజింగ్ మధ్య దౌత్య వివాదం కారణంగా చైనా నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గింది. ఒక అంచనా ప్రకారం, దేశీయ కార్మిక శక్తి తగ్గిపోతుండటంతో 2040 నాటికి జపాన్ తన ఆర్థిక వృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే 65 లక్షలకు పైగా విదేశీ కార్మికులు అవసరం అవుతారు. ఇటీవల విదేశీ జనాభా పెరిగినా, వలసలను నియంత్రించాలని ప్రభుత్వం రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
వివరాలు
నిరంతరం పనిచేయనున్న రోబోలు..
జీఎంఓ ఏఐ అండ్ రోబోటిక్స్ అధ్యక్షుడు తోమోహిరో ఉచిదా మాట్లాడుతూ.. విమానాశ్రయాలు బయటకు చూస్తే పూర్తిగా ఆటోమేటెడ్గా కనిపిస్తాయన్నారు. వెనుక జరిగే కార్యకలాపాలు ఇప్పటికీ మానవ శ్రమపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయన్నారు. అక్కడ కార్మికుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఈ రోబోలు ఒకేసారి రెండు నుంచి మూడు గంటల పాటు నిరంతరంగా పనిచేయగలవన్నారు. భవిష్యత్తులో విమానాల కేబిన్ శుభ్రపరిచే పనుల వంటి ఇతర బాధ్యతలకూ వీటిని వినియోగించే ప్రణాళికలు ఉన్నాయని సంస్థలు తెలిపాయి.