ICE: ఓపీటీ ఉద్యోగాల పేరుతో మోసం.. 10 వేలకుపైగా అనుమానాస్పద కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్-1 వీసాతో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది విద్యార్థులు నకిలీ సంస్థల పేర్లతో మోసపూరిత వ్యవస్థలో చిక్కుకున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం బయటపడటంతో విదేశీ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) డైరెక్టర్ టాడ్ ఎమ్ లియోన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓపీటీ విధానం అక్రమాలకు కేంద్రంగా మారిందని దర్యాప్తులో తేలింది.
వివరాలు
ట్రంప్, బైడెన్ ప్రభుత్వాల సమయంలో మరింత పెరిగిన మోసాలు
మొదట బుష్, ఒబామా ప్రభుత్వాల కాలంలో కొద్దిమంది విద్యార్థులకు అనుభవం కల్పించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని, కానీ ప్రస్తుతం అది అక్రమ వలసలకు మార్గంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్, బైడెన్ ప్రభుత్వాల సమయంలో ఈ మోసాలు మరింత పెరిగాయని అధికారులు చెబుతున్నారు. అసలు ఉనికిలో లేని సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి వేలాది మంది విద్యార్థులను వ్యవస్థలో కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. కేవలం ప్రధాన 25 ఓపీటీ సంస్థల వివరాలను పరిశీలించగా దాదాపు 10 వేల మంది విద్యార్థులు అనుమానాస్పద సంస్థలతో సంబంధం ఉన్నట్లు బయటపడిందని లియోన్స్ తెలిపారు.
వివరాలు
కార్యాలయాల వద్ద ఖాళీ భవనాలు, తాళం వేసిన గదులు
ఇది కేవలం ఒక భాగమేనని, పూర్తి స్థాయి దర్యాప్తులో ఇంకా పెద్ద స్థాయిలో అక్రమాలు బయటపడే అవకాశం ఉందన్నారు. దర్యాప్తు అధికారులు అనుమానాస్పద సంస్థల చిరునామాలను పరిశీలించగా ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. వందలాది మంది విద్యార్థులు పనిచేస్తున్నట్లు చూపించిన కార్యాలయాల వద్ద ఖాళీ భవనాలు, తాళం వేసిన గదులు మాత్రమే కనిపించాయి. ఒకే చిరునామాతో పలు సంస్థలు నమోదు కావడం, సరైన అద్దె ఒప్పందాలు లేకపోవడం, విదేశాల నుంచి అనుమానాస్పద నగదు లావాదేవీలు జరగడం వంటి అంశాలు అధికారులకు అనుమానం కలిగించాయి.
వివరాలు
టెక్సాస్లో 18 ఓపీటీ కేంద్రాలపై దాడులు
హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ బృందం ఇటీవల టెక్సాస్లో 18 ఓపీటీ కేంద్రాలపై దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ అక్రమ జాలం బయటపడింది. ఒక సంస్థలో కేవలం ముగ్గురు విద్యార్థులే పనిచేస్తున్నారని యాజమాన్యం చెప్పినా, అధికారిక రికార్డుల్లో మాత్రం 500 మంది పేర్లు నమోదై ఉండటం సంచలనంగా మారింది. అక్కడి సిబ్బంది ప్రాథమిక ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. చాలా విషయాల్లో ఇండియాలో ఉన్న మానవ వనరుల ప్రతినిధులను సంప్రదించాలని చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. ఒకే విధమైన ఉద్యోగ ప్రకటనలు, ఒకే తరహా విధానాలతో పలు సంస్థలు కలిసి ఈ అక్రమ వ్యవస్థను నడిపిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అమెరికాలో ఓపీటీ స్కామ్ బట్టబయలు.. 10 వేల అనుమానాస్పద కేసులు
Another great win for our fraud task force. We will not tolerate foreign nationals abusing our visa system at the expense of the American people. https://t.co/smFBgxha3w
— JD Vance (@JDVance) May 12, 2026