
Iran-Israel: ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య ఉద్రిక్తత రోజురోజుకీ పెరిగిపోతున్ననేపథ్యంలో,ఆ ప్రాంతంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించే ప్రక్రియకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఈ చర్యల్లో భాగంగా,మొదటి విడతగా 110 మంది భారతీయులను అర్మేనియాకు తరలించినట్టు విదేశాంగ శాఖ మంగళవారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితుల పరంగా భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని, ఆ ప్రాంతం నుంచి భారతీయులను బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
స్వయం రవాణా వనరులు కలిగి ఉన్న వారు కూడా ఆ ప్రాంతాన్ని వీడాలని సూచించబడింది.
ఇప్పటివరకు తొలిబ్యాచ్లో భాగంగా 110 మంది భారతీయులు ప్రాంతం విడిచి వెళ్లగా, వారు సురక్షితంగా అర్మేనియాకు చేరుకున్నట్లు అధికారిక సమాచారం.
వివరాలు
కీలక అడ్వైజరీ జారీ చేసిన ఇరాన్ లోని భారత దౌత్య కార్యాలయం
ఈ బృందం బుధవారం నాడు ఢిల్లీ చేరుకోనుంది. ఇక, ఇజ్రాయెల్ జరుపుతున్న ఎయిర్స్ట్రైక్లు, పేలుళ్ల ప్రభావంతో టెహ్రాన్ నగరం బాగా ప్రభావితమవుతోంది.
దీనితో అక్కడి భారత దౌత్య కార్యాలయం ఒక కీలక ప్రకటన (అడ్వైజరీ) విడుదల చేసింది.
టెహ్రాన్లో ఉన్న భారతీయులు వెంటనే నగరాన్ని విడిచిపెట్టాలని, టెహ్రాన్ కన్నా భద్రత పరంగా మెరుగైన ప్రాంతాలకు వెళ్లాలని కోరింది.
ఇప్పటివరకు భారత ఎంబసీని సంప్రదించని వారు, తక్షణమే తమ సమాచారాన్ని అధికారులతో పంచుకోవాలని,అవసరమైన సంపర్కం ఏర్పాటు చేయాలని సూచించింది.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తలెత్తిన ఈ సంక్షోభాన్ని భారత రాయబార కార్యాలయం నిశితంగా పరిశీలిస్తూ, ఆ ప్రాంతాల్లో ఉన్న భారత విద్యార్థులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ ఉందని తెలియజేసింది.