Russia: ఏ దేశం నుంచైనా భారత్ చమురు కొనుగోలు చేసే స్వేచ్ఛగా ఉంది: వెనిజులా చమురు కొనుగోలు చర్చలపై రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసుకునే పూర్తి స్వేచ్ఛ భారత్కు ఉందని రష్యా స్పష్టం చేసింది. విభిన్న దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం భారత్కు కొత్త విషయం కాదని తెలిపింది. భారత్కు రష్యా మాత్రమే చమురు సరఫరా చేయడం లేదన్న విషయం అంతర్జాతీయ ఇంధన రంగ నిపుణులందరికీ తెలుసని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. భారత్ చాలా కాలంగా ఇతర దేశాల నుంచీ చమురును కొనుగోలు చేస్తోందని, అందువల్ల రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించడం లేదా నిలిపేయడం ఆశ్చర్యకరమైన అంశం కాదని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
హైడ్రోకార్బన్ల వాణిజ్యం రెండు దేశాలకు లాభదాయకమే..
ఇదిలా ఉండగా, భారత్-రష్యాల మధ్య హైడ్రోకార్బన్ల వాణిజ్యం రెండు దేశాలకు లాభదాయకమేనని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా తెలిపారు. ఇంధన రంగంలో పరస్పర సహకారం కొనసాగడం వల్ల ఇరు దేశాల ప్రయోజనాలు కాపాడబడుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు పూర్తిగా నిలిపేయడం సాధ్యం కాదని రష్యా జాతీయ ఇంధన భద్రతా నిధి నిపుణుడు ఐగోర్ యుష్కోవ్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఎగుమతి చేసే షేల్ చమురు తక్కువ గ్రేడ్లో ఉండటంతో పాటు గ్యాస్లో కండెన్సేట్ కూడా తక్కువగా ఉంటుందని ఆయన వివరించారు.
వివరాలు
భారత్కు రష్యా రోజుకు సగటున 15 లక్షల నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురు
వాటితో పోలిస్తే రష్యా సరఫరా చేసే యూరల్స్ చమురు భారీగా ఉండి, సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ కారణంగా అమెరికా నుంచి తక్కువ గ్రేడ్ చమురును భారత్ అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయం అంత సులభం కాదని యుష్కోవ్ పేర్కొన్నారు. అదే సమయంలో రష్యా రోజుకు సగటున 15 లక్షల నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును భారత్కు సరఫరా చేస్తోందని, అంత పెద్ద పరిమాణంలో అమెరికా సరఫరా చేయలేదని ఆయన వెల్లడించారు. 2022లో భారత్ అమెరికా సహా ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల బ్యారెల్ ధర 120 డాలర్ల వరకు పెరిగిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.