JEE Data: భారత్ టాలెంట్ విదేశాలకే.. JEE 30 ఏళ్ల గణాంకాల్లో బయటపడిన వాస్తవం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో అత్యుత్తమ విద్యార్థులు విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడే ధోరణి కొనసాగుతూనే ఉందని Careers 360 అధ్యయనం వెల్లడించింది. 1990 నుంచి 2021 వరకు JEE టాపర్లలో 31 మందిలో 23 మంది విదేశాల్లోనే స్థిరపడ్డారు. వీరందరూ మాస్టర్స్ లేదా పీహెచ్డీ కోసం విదేశాలకు వెళ్లినట్లు నివేదిక తెలిపింది. భారత ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే JEE పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం అమెరికానే టాపర్లకు ప్రధాన గమ్యస్థానంగా నిలిచింది. మొత్తం 31 మందిలో 17 మంది అమెరికాలో ఉండగా, 28 మంది విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. దేశం అంతర్జాతీయంగా ఎదుగుతున్నా, ప్రతిభ విదేశాలకు వెళ్లే ప్రవాహం తగ్గలేదని నివేదిక పేర్కొంది.
వివరాలు
భారత ఇంజినీర్లు సిలికాన్ వ్యాలీ అభివృద్ధిలో కీలక పాత్ర
1990-2010 మధ్య 66.7 శాతం టాపర్లు అమెరికాకు వెళ్లగా, 2011-21లో అది 90 శాతానికి పెరిగింది. దశాబ్దాలుగా భారత ఇంజినీర్లు సిలికాన్ వ్యాలీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో దేశంలో పరిశోధన వసతులు, ఇన్నోవేషన్ వాతావరణం, వ్యాపార అనుకూల పరిస్థితులు తక్కువగా ఉండటం వల్ల టాలెంట్ను నిలుపుకోవడంలో భారత్ వెనుకబడి ఉందని వారు అంటున్నారు. పరిశ్రమ-విద్యాసంస్థల అనుసంధానం బలహీనంగా ఉండటం, సరైన అవకాశాలు లేకపోవడం వల్ల యువ ఇంజినీర్లు విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు పలు టెక్ దిగ్గజ సంస్థలను భారతీయులే నడిపిస్తున్నప్పటికీ, వారు విదేశాల్లోనే విజయం సాధించడం ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా చూపుతోంది.
వివరాలు
2000కి ముందు అకాడమిక్ రంగం,పరిశోధన వైపు టాపర్లు
దేశాల వారీగా చూస్తే అమెరికాలో 17 మంది (54.8%),భారత్లో 8 మంది (25.8%),స్విట్జర్లాండ్లో 2 మంది (6.5%),కెనడా,నెదర్లాండ్స్,హాంకాంగ్,దక్షిణ కొరియా దేశాల్లో ఒక్కొక్కరు (3.2%) చొప్పున ఉన్నారు. మరో ముఖ్యమైన మార్పు కూడా ఈ అధ్యయనం చూపించింది. 2000కి ముందు టాపర్లు ఎక్కువగా అకాడమిక్ రంగం,పరిశోధన వైపు మొగ్గు చూపగా, 2000 తర్వాత వారు బిగ్ టెక్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, స్టార్టప్ల వైపు మళ్లినట్లు గుర్తించింది. చివరగా పరిశోధకులు కీలక ప్రశ్నను లేవనెత్తారు: ప్రపంచ స్థాయి టెక్నాలజీ, పరిశోధనలో ముందంజలో ఉండాలనుకునే భారత్కు ఇది హెచ్చరిక. దేశం తయారు చేస్తున్న ఉత్తమ మేధస్సు బయట పనిచేయాలని ఎందుకు ఎంచుకుంటోంది? వారిని భారత్లోనే నిలబెట్టాలంటే ఏమి చేయాలి? అన్నది ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం అని సూచించారు.