Iran oil returns: 5 ఏళ్ల తర్వాత భారత్కు ఇరాన్ చమురు రాక.. అమెరికా నిర్ణయంతో మారిన సమీకరణాలు
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధ పరిస్థితుల కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు (Iranian Crude)పై విధించిన ఆంక్షలను అమెరికా తాజాగా సడలించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో భారతీయ రిఫైనరీలు మళ్లీ ఇరాన్ చమురు కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ భారత్ వైపు ప్రయాణం ప్రారంభించింది. మార్చి 4న ఖర్గ్ ద్వీపం వద్ద ఈ ట్యాంకర్లో చమురు లోడ్ చేసినట్లు సమాచారం. డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ ప్రకారం,ఈ నౌక ఏప్రిల్ 4న గుజరాత్లోని వాడినార్ పోర్టుకు చేరుకోనుంది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2019 తర్వాత ఇరాన్ నుంచి భారత్కు చమురు రావడం ఇదే తొలిసారి.
వివరాలు
6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉండే అవకాశం
ఈ ట్యాంకర్లో సుమారు 6 లక్షల బ్యారెళ్ల ముడి చమురు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఈ చమురును దేశంలోని ఏ రిఫైనరీ వినియోగించనుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. గతంలో భారత్ ఇరాన్ చమురుకు ముఖ్యమైన దిగుమతిదారుగా ఉండేది. ఒక దశలో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా దాదాపు 11.5 శాతంగా నమోదైంది.
వివరాలు
2018లో భారత్ రోజుకు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురు
2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకుంది. కానీ 2019 మే నాటికి ఈ పరిమాణం రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గిపోయింది. అనంతరం, అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు తాజా పరిణామాలతో మళ్లీ ఇరాన్ చమురు భారత్కు చేరడం, భవిష్యత్తులో ఇంధన రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.