India-US Trade Deal: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్లో భారత్కు కొన్ని మినహాయింపులు: అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అగ్ర వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు. అయితే, వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని దిగుమతుల విషయంలో మాత్రం భారత్కు ప్రత్యేక నియంత్రణలు, మినహాయింపులు కల్పించేలా ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్లో వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపారు. ఆ మినహాయింపులు వర్తించే ఉత్పత్తులు ఏవో నిర్ణయించుకునేందుకు ఇరు దేశాలు కలిసి చర్చలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. అంటే, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్ల అంశం ఇప్పటికీ తుది నిర్ణయానికి రాలేదన్న సంకేతాలను గ్రీర్ ఇచ్చారు.
వివరాలు
కొన్ని ఉత్పత్తులపై సున్నా సుంకాలు
ఇరు దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పందం ఒక గొప్ప అవకాశమని జెమిసన్ గ్రీర్ పేర్కొన్నారు. ఈ డీల్ అమెరికాకు భారీ లాభాన్ని తీసుకురానుందని చెప్పారు. భారత్తో అమెరికాకు ఉన్న వాణిజ్య లోటు ఈ ఒప్పందం ద్వారా తగ్గే అవకాశం ఉందని వివరించారు. తాజా చర్చల ఫలితంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు,తయారీ రంగానికి అవసరమైన ఉపకరణాలు, రసాయనాలు,వైద్య పరికరాలపై టారిఫ్లను తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికా పారిశ్రామిక ఉత్పత్తులపై భారత్లో సగటున 13.5శాతం వరకు దిగుమతి సుంకాలు ఉండగా,అవి ఇకపై సున్నాకు తగ్గనున్నాయని చెప్పారు. అలాగే, అమెరికాకు చెందిన కొన్ని రకాల గింజలు, వైన్, మద్యం ఉత్పత్తులు, పండ్లు, కూరగాయాలపై కూడా జీరో టారిఫ్లు అమలులోకి రానున్నాయని స్పష్టం చేశారు.
వివరాలు
కొన్ని ఉత్పత్తులపై సున్నా సుంకాలు
ఈ సందర్భంగా భారత్-రష్యా మధ్య చమురు లావాదేవీలపై కూడా గ్రీర్ మాట్లాడారు. 2022-23కి ముందు వరకు రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ముడిచమురు కొనుగోలు చేయలేదని గుర్తు చేశారు. పశ్చిమ దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా డిస్కౌంట్ ధరలకు చమురు లభించడంతో భారత్ కొనుగోళ్లు పెంచిందని చెప్పారు. అయితే, గత ఏడాది చివరి నుంచి రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు.
వివరాలు
భారత్ 500 బిలియన్ డాలర్ల పెట్టుబడులు..
ఈ వాణిజ్య ఒప్పందాన్ని వైట్హౌస్ స్వాగతించింది. అమెరికాలోని పలు రంగాల్లో భారత్ సుమారు 500 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించినట్లు ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చిందని, అదే సమయంలో అమెరికా, వెనెజువెలా నుంచి చమురు దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేసిందని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. ఈ నిర్ణయాలు అమెరికా ప్రజలకు నేరుగా లాభాలు చేకూర్చేలా ఉంటాయని ఆమె పేర్కొన్నారు.