Oman coast : ఒమన్ తీరంలో విషాదం.. డ్రోన్ దాడిలో భారతీయుడు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఒమన్ తీరానికి సమీపంలో భారీ విషాదం చోటుచేసుకుంది. డ్రోన్ బోటును ఢీకొనడంతో ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగి, ఓ భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, శనివారం మస్కట్ గవర్నరేట్ పరిధిలోని పోర్ట్ సుల్తాన్ ఖాబూస్కు వాయువ్య దిశగా సుమారు 52నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న'ఎంకేడీ వ్యోమ్' అనే ఆయిల్ ట్యాంకర్పై మనుషుల్లేని డ్రోన్ పడవ ఢీకొట్టడంతో ఇంజిన్ గదిలో పేలుడు సంభవించి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన సమయంలో నౌకలో దాదాపు 59,463 మెట్రిక్ టన్నుల సరుకు ఉంది.
వివరాలు
దెబ్బతిన్న ట్యాంకర్పై ఒమన్ రాయల్ నేవీ నిఘా
మొత్తం 21 మంది సిబ్బందిలో 16 మంది భారతీయులు,నలుగురు బంగ్లాదేశ్ పౌరులు, ఒకరు ఉక్రెయిన్కు చెందినవారు ఉన్నారు. ప్రాణాలతో బయటపడ్డ వారందరినీ పానామా జెండాతో ప్రయాణిస్తున్న'ఎంవీ సాండ్' అనే వాణిజ్య నౌక సురక్షితంగా తరలించింది. దెబ్బతిన్న ట్యాంకర్పై ఒమన్ రాయల్ నేవీ నిఘా ఉంచింది. ఈ దాడికి బాధ్యులు ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధికి సమీపంలో నౌకలు జాగ్రత్తగా ఉండాలని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.
వివరాలు
హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇది రెండో దాడి
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో సముద్ర మార్గాల్లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇది రెండో దాడిగా సమాచారం. అంతకుముందు ఒమన్ ముసందామ్ ద్వీపకల్పం సమీపంలో పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న 'స్కైలైట్' ఆయిల్ ట్యాంకర్పై కూడా దాడి జరగగా, అందులో ఉన్న 15 మంది భారతీయులతో కలిపి 20 మంది సిబ్బందిని ఖసబ్ పోర్ట్కు ఉత్తర దిశగా సుమారు ఐదు నాటికల్ మైళ్ల దూరంలో సురక్షితంగా తరలించారు. ఆ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. అయితే ఏ ఆయుధంతో దాడి జరిగిందన్నది అధికారులు వెల్లడించలేదు.