LOADING...
UAE: రెండు నెలల క్రితమే ఖాతా ఓపెన్ చేశాడు.. ఇప్పుడు రూ.5 కోట్ల లక్కీ డ్రా విజేత!
రెండు నెలల క్రితమే ఖాతా ఓపెన్ చేశాడు.. ఇప్పుడు రూ.5 కోట్ల లక్కీ డ్రా విజేత!

UAE: రెండు నెలల క్రితమే ఖాతా ఓపెన్ చేశాడు.. ఇప్పుడు రూ.5 కోట్ల లక్కీ డ్రా విజేత!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 17, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అబుదాబిలో నివసిస్తున్న భారతీయ మూలాల వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని అబుదాబిలో ఉంటున్న షజీర్ వెంగా అనే భారతీయుడు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (SIB) నిర్వహించిన 'మిలియనీర్ క్యాంపెయిన్' లక్కీ డ్రాలో 20 లక్షల దిర్హమ్‌లు (సుమారు రూ.5.15 కోట్లు) గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే, ఆయన బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ తెరిచి రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతిని సొంతం చేసుకున్నారు.

వివరాలు

డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ అకౌంట్..

34 ఏళ్ల షజీర్ వెంగా బ్యాంక్ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే నిర్వహించిన డ్రాలో ఆయనకు గ్రాండ్ క్యాష్ ప్రైజ్ లభించింది. ఇదే డ్రాలో యూఏఈకి చెందిన మొజా బుట్టి అనే మహిళ లగ్జరీ BMW XM కారును గెలుచుకున్నారు. వీరితో పాటు మరో 40 మంది విజేతలు నగదు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఖలీజ్ టైమ్స్‌తో మాట్లాడిన షజీర్ వెంగా, ఈ బహుమతి తన ఎన్నో ఏళ్ల కలను నిజం చేసిందని తెలిపారు. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ నిర్వహిస్తున్న ఈ క్యాంపెయిన్ గురించి ముందే తెలుసునని, ఒకరోజు తాను కూడా విజేతగా నిలవాలని ఆశించేవాడినని చెప్పారు.

వివరాలు

2025 నుంచి ఆ కార్యక్రమం ప్రారంభం..

"20లక్షల దిర్హమ్‌ల ఈ బహుమతి నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ డబ్బుతో నా భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టగలను. అలాగే భారత్‌లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి నాతో కలిసి ఉండేలా చేయగలను" అని ఆయన తెలిపారు. "షార్జా ఇస్లామిక్ బ్యాంక్ తన హామీని నిలబెట్టుకుంది. ఒకప్పుడు కేవలం కలగా ఉన్న విషయం ఇప్పుడు నిజమైంది" అని షజీర్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక 'మిలియనీర్' క్యాంపెయిన్ విషయానికి వస్తే, కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ 2025లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. సేవింగ్స్ ఖాతాల ద్వారా సంపదను పెంచుకునేలా ఈ పథకం కింద ప్రతి ఏడాది 2 కోట్ల దిర్హమ్‌లకు పైగా బహుమతులు అందజేస్తోంది.

Advertisement

వివరాలు

లక్కీ డ్రాతో నగదు బహుమతి..

బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం, సేవింగ్స్ ఖాతాలో ప్రతి 10 వేల దిర్హమ్‌లు జమ చేసినందుకు కస్టమర్‌కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఈ ఎంట్రీల ఆధారంగా నిర్వహించే లక్కీ డ్రాల్లో నగదు బహుమతులతో పాటు లగ్జరీ వాహనాలను కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ రిటైల్ బ్యాంకింగ్ విభాగం అధిపతి నబీల్ అబౌ అల్వాన్ మాట్లాడుతూ, ఈ క్యాంపెయిన్ ద్వారా కస్టమర్లు తమ లక్ష్యాలను సాధించేందుకు, కుటుంబాలతో కలిసి మెరుగైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు మంచి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.

Advertisement

వివరాలు

అన్ని దేశాల పౌరులు అర్హులేనా?

"షజీర్ కలను నిజం చేసే ప్రక్రియలో బ్యాంక్ భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణం. ఈ కార్యక్రమం అనేక మంది జీవితాల్లో మార్పు తీసుకువస్తూనే ఉంది. కస్టమర్ల ఆశయాలను నెరవేర్చేందుకు మా కట్టుబాటును ఇది మరింత బలపరుస్తోంది" అని ఆయన చెప్పారు. ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం, తదుపరి డ్రాలో ఒక్కోటి 10 లక్షల దిర్హమ్‌ల విలువైన రెండు గ్రాండ్ ప్రైజ్‌లు ఉండనున్నాయి. ఇందులో ఒక బహుమతి యూఏఈ పౌరులకు మాత్రమే కేటాయించగా, మరో బహుమతికి అన్ని దేశాల పౌరులు అర్హులు కానున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

Advertisement