UAE: యూఏఈలో భారత పాస్పోర్టు సేవలు బంద్.. 5 రోజుల పాటు నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
భారత రాయబార కార్యాలయం, అబుదాబి కీలక ప్రకటన చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో భారతీయులకు అందిస్తున్న పాస్పోర్టు, వీసా తదితర కాన్సులర్ సేవలు ఈ నెల 26 నుంచి 30 వరకు ఐదు రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. అవుట్సోర్సింగ్ సేవల నిర్వహణలో మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అబుధాబీలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం కాన్సులర్ సేవలను నిర్వహిస్తున్న సంస్థల స్థానంలో కొత్త సేవా సంస్థ బాధ్యతలు స్వీకరించనుంది. జులై 1 నుంచి పాస్పోర్టు, వీసా సహా ఇతర కాన్సులర్ సేవలను అల్హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధికారికంగా నిర్వహించనున్నట్లు ఎంబసీ ప్రకటించింది.
వివరాలు
అత్యవసరం ఉంటే జూన్ 25లోగా దరఖాస్తులు చేసుకోవాలి
ఇదే సమయంలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, SGIVS గ్లోబల్ సంస్థలు ఈ నెల 25వ తేదీ నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించబోవని స్పష్టం చేశాయి. దీంతో యూఏఈలో నివసిస్తున్న భారతీయులు పాస్పోర్టు, వీసా లేదా ఇతర కాన్సులర్ సేవలకు సంబంధించిన అత్యవసర అవసరాలు ఉంటే జూన్ 25లోపు దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జులై 1 నుంచి కొత్త సర్వీస్ ప్రొవైడర్ ద్వారా సేవలు మళ్లీ సాధారణంగా అందుబాటులోకి రానున్నాయి.