Page Loader
Trump Tariffs: ట్రంప్‌ అధిక సుంకాల దెబ్బ.. అమెరికాకు భారతదేశ ఎగుమతులు 5.76 బిలియన్ డాలర్లు తగ్గవచ్చు: GTRI
ట్రంప్‌ అధిక సుంకాల దెబ్బ.. అమెరికాకు భారతదేశ ఎగుమతులు 5.76 బిలియన్ డాలర్లు తగ్గవచ్చు: GTRI

Trump Tariffs: ట్రంప్‌ అధిక సుంకాల దెబ్బ.. అమెరికాకు భారతదేశ ఎగుమతులు 5.76 బిలియన్ డాలర్లు తగ్గవచ్చు: GTRI

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై గణనీయంగా కనిపించనున్నది. ఈ పరిణామంతో, అమెరికాకు ఈ ఏడాది భారత్‌ నుంచి ఎగుమతుల విలువ తగ్గనుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్‌ (GTRI) అనే ప్రఖ్యాత డేటా విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. ట్రంప్ ప్రభుత్వం సుంకాలను పెంచడం వల్ల సముద్ర సంపత్తులు, బంగారు వస్తువులు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వర్గాల్లోని ఎగుమతుల విలువ ఈ ఏడాది సుమారు 5.76 బిలియన్ డాలర్ల మేర తగ్గే అవకాశముందని వెల్లడించింది.

వివరాలు 

5.76 బిలియన్ డాలర్లు లేదా 6.41 శాతం తగ్గుదల

అయితే,కొన్ని ఎంపికైన ఉత్పత్తుల విభాగాల్లో భారత్‌ కలిగిన పోటీ సామర్థ్యం కొన్ని నష్టాలను తగ్గించగలదని పేర్కొంది. స్వల్ప లాభాల అవకాశాలు ఉన్న రంగాలలో వస్త్ర పరిశ్రమ, దుస్తుల తయారీ,సిరామిక్ ఉత్పత్తులు, అకర్బన రసాయనాలు,ఔషధ ఉత్పత్తులు ఉంటాయని పేర్కొంది. ట్రంప్ తీసుకున్న ప్రతీకార చర్యల నేపథ్యంలో భారత్‌పై సగటున 26 శాతం టారిఫ్‌లు విధించినట్లు తెలిసింది. ''వివరణాత్మక వాణిజ్య గణాంకాలు,టారిఫ్ షెడ్యూల్స్ ఆధారంగా, 2025 నాటికి భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతుల విలువలో సుమారు 5.76 బిలియన్ డాలర్లు లేదా 6.41 శాతం తగ్గుదల వచ్చే అవకాశం ఉందని మేము అంచనా వేస్తున్నాం'' అని GTRI స్పష్టం చేసింది. 2024లో భారత్ నుంచి అమెరికాకు జరిగిన ఎగుమతుల మొత్తం విలువ 89.81బిలియన్ డాలర్లుగా నమోదైంది.

వివరాలు 

12 శాతం మేర తగ్గుదల 

జీటీఆర్‌ఐ ప్రకారం, అనేక ప్రధాన రంగాల్లో ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని అంచనా. చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల్లో 20.2 శాతం, ఇనుము, ఉక్కు ఉత్పత్తుల్లో 18 శాతం, వజ్రాలు, బంగారు ఉత్పత్తుల్లో 15.3 శాతం, వాహనాలు, వాటి విడిభాగాలలో 12.1 శాతం, అలాగే ఎలక్ట్రికల్, టెలికాం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో 12 శాతం మేర తగ్గుదల వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.